Telugu Global
National

స్టాండప్ కమెడియన్లు అంటే బీజేపీకి ఎందుకంత భయం..?

ఎన్డీఏపై ఛలోక్తులు విసిరే విషయంలో కునాల్ కమ్రా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. మోదీని అనుకరిస్తూ, ఆయనపై పంచ్ లు వేస్తూ కమ్రా చేసే ప్రదర్శనలు అన్ని ప్రాంతాల్లోనూ ఆకట్టుకున్నాయి.

స్టాండప్ కమెడియన్లు అంటే బీజేపీకి ఎందుకంత భయం..?
X

కేవలం ప్రతిపక్షాలే కాదు, బీజేపీ ప్రభుత్వానికి ఇతర చాలా వర్గాలంటే కూడా భయమే. అందులో ప్రముఖంగా స్టాండప్ కమెడియన్లు ఉన్నారు. కొన్నాళ్లుగా స్టాండప్ కమెడియన్లు బీజేపీ వ్యవహారాలతో విసిగిపోయారు. కొన్నిచోట్ల రాజకీయ సెటైర్లు వేయాల్సి ఉంటుంది. ఇతర పార్టీలు విశాల హృదయంతో ఆ హాస్యాన్ని పాజిటివ్ గా తీసుకున్నా.. బీజేపీ మాత్రం సహించలేకపోతోంది, భరించలేకపోతోంది. అందుకే స్టాండప్ కమెడియన్ల షో లు రద్దు చేస్తూ వారికి అసహనం తెప్పిస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో మునావర్ ఫారుఖి షో విషయంలో ఎంత రాద్ధాంతం జరిగిందో చూశాం. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అతనిపై దాడి చేస్తానంటూ రెచ్చిపోయారు. చివరకు అనుచిత వ్యాఖ్యలతో జైలులో కూర్చున్నారు. తాజాగా కునాల్ కమ్రాని బీజేపీ టార్గెట్ చేసింది. గురుగ్రామ్ లో ఆయన షో రద్దయింది.

ఎన్డీఏపై కమ్రా ఛలోక్తులు..

ఎన్డీఏపై ఛలోక్తులు విసిరే విషయంలో కునాల్ కమ్రా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. మోదీని అనుకరిస్తూ, ఆయనపై పంచ్ లు వేస్తూ కమ్రా చేసే ప్రదర్శనలు అన్ని ప్రాంతాల్లోనూ ఆకట్టుకున్నాయి. ఇటీవల ఇతనిపై బీజేపీ ఫోకస్ పెంచింది. కమ్రా షో లను రద్దుచేసేందుకు ఆయా యాజమాన్యాలను బెదిరిస్తోంది. గురుగ్రామ్ లో చివరి నిముషంలో ఇలా కమ్రా షో రద్దయింది. తన జీవనోపాధిని దెబ్బకొట్టడం ద్వారా బీజేపీ ఏం సాధిస్తుందని నిలదీశారు కమ్రా.

గాడ్సే ముర్దాబాద్ అనగలరా..?

బీజేపీ ప్రోద్బలంతో వీహెచ్‌పీ తనకి వార్నింగ్ లు ఇస్తోందని ఆరోపిస్తున్నారు కమ్రా. తనని బెదిరిస్తున్నారని, భయపెట్టి వారికి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారని చెప్పారు. వీహెచ్‌పీ కంటే తాను పెద్ద హిందువుని అని చెప్పారు కమ్రా. తాను జై సీతారాం.. జై రాధాకృష్ణ అని గర్వంగా అంటానని, అదే సమయంలో వీహెచ్‌పీ నేతలు గాడ్సే ముర్దాబాద్ అనగలరా అని ప్రశ్నించారు. వీహెచ్‌పీ నేతలు నిజంగా భారత జాతి సంతతి అయితే గాడ్సే ముర్దాబాద్ అనాలని, లేకుంటే వారంతా హిందూ వ్యతిరేకులు, తీవ్రవాదులుగా ముద్ర వేయించుకోవాలని హెచ్చరించారు.

మొత్తమ్మీద ఇప్పుడు బీజేపీ చిన్న చిన్న విషయాలకు కూడా భయపడుతోందని అర్థమవుతోంది. తమకు వ్యతిరేకంగా ఎక్కడ ఏం జరిగినా చూసి సహించలేకపోతున్నారు బీజేపీ నేతలు. స్టాండప్ కమెడియన్ల స్వేచ్ఛను కూడా వారు హరిస్తున్నారు. వారిని చూసి ఉలిక్కిపడుతున్నారు. వారి షో లను రద్దు చేస్తూ పైశాచికానందాన్ని పొందుతున్నారు. ప్రజల్లో పలుచన అవుతున్నారు.

First Published:  12 Sep 2022 6:30 AM GMT
Next Story