Telugu Global
National

కర్నాటక స్కూల్స్ లో మళ్లీ వాటర్ బెల్..

రెండేళ్ల క్రితం వాటర్ బెల్ కాన్సెప్ట్ ని ప్రవేశ పెట్టింది కర్నాటక ప్రభుత్వం. అయితే కరోనా కారణంగా ఇటీవల దీన్ని పక్కనపెట్టారు. ఇప్పుడు స్కూల్స్ తిరిగి పూర్తిస్థాయిలో మొదలు కావడంతో వాటర్ బెల్ మోగించడానికి కర్నాటక సర్కారు సిద్ధమైంది.

కర్నాటక స్కూల్స్ లో మళ్లీ వాటర్ బెల్..
X

సాధారణంగా స్కూల్స్ లో ఇంటర్వెల్ ఉంటుంది. బాత్రూమ్ కి వెళ్లాలన్నా, దాహం వేసినా ఇంటర్వెల్ లో పని పూర్తి చేసుకుని తిరిగి క్లాస్ రూమ్ కి వస్తుంటారు పిల్లలు. కానీ దాహం వేసేవరకు కొంతమంది మంచినీరు తగినంత తీసుకోరు. ఈ అలవాటు వల్ల డీహైడ్రేషన్ ఏర్పడి ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. దీన్ని నివారించేందుకు రెండేళ్ల క్రితం వాటర్ బెల్ కాన్సెప్ట్ ని ప్రవేశ పెట్టింది కర్నాటక ప్రభుత్వం. అయితే కరోనా కారణంగా ఇటీవల దీన్ని పక్కనపెట్టారు. ఇప్పుడు స్కూల్స్ తిరిగి పూర్తి స్థాయిలో మొదలు కావడంతో వాటర్ బెల్ మోగించడానికి కర్నాటక సర్కారు సిద్ధమైంది.

వాటర్ బెల్ కాన్సెప్ట్ ఏంటి..?

ఇంటర్వెల్ కాకుండా ప్రతిరోజూ స్కూల్ లో మూడుసార్లు వాటర్ బెల్ మోగిస్తారు. ఉదయం 10.35 గంటలకు ఓసారి, మధ్యాహ్నం 12గంటలకు రెండోసారి, ఆ తర్వాత 2 గంటలకు మరోసారి వాటర్ బెల్ మోగిస్తారు. ఆ సమయంలో దాహం వేసినా వేయకపోయినా క్లాస్ రూమ్ లో ఉన్న పిల్లలు తమ పక్కన ఉన్న వాటర్ బాటిల్స్ ఓపెన్ చేసి నీరు తాగాలి. వాటర్ బాటిల్స్ తెచ్చుకోనివారు స్కూల్ లో ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గరకు వెళ్లి నీరు తాగాలి. ఇది అందరికీ తప్పనిసరి. ఈ అలవాటుతో పిల్లల్లో డీహైడ్రేషన్ సమస్య చాలా వరకు తీరుతుందని ప్రభుత్వం భావించింది. నిపుణులు కూడా ఈ పద్ధతిని పూర్తిగా సమర్థించారు. ఇది సక్సెస్ కావడంతో తెలంగాణ, ఏపీ, కేరళలో కూడా దీన్ని అవలంబించారు.

ప్రైవేట్ స్కూల్స్ లో కూడా తప్పనిసరి..

సాధారణంగా ప్రైవేట్ స్కూల్స్ లో ఇంటర్వెల్ టైమ్‌ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మిగతా టైమ్ లో పిల్లలను బాత్రూమ్ కి వెళ్లేందుకు కూడా అంగీకరించరు టీచర్లు. అలాంటి పద్ధతి మారాలంటున్నారు నిపుణులు. పిల్లలు ఎక్కువసేపు మాత్ర విసర్జన చేయకుండా ఉంటే వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, అదే సమయంలో ఎక్కువసేపు నీరు తీసుకోకుండా ఉన్నా కూడా సమస్యలు మొదలవుతాయని అంటున్నారు. వాటర్ బెల్ కాన్సెప్ట్ ని నిపుణులు సమర్థిస్తున్నారు. త్వరలో ఇతర రాష్ట్రాల్లో కూడా దీన్ని పునరుద్ధరించాలంటున్నారు.

First Published:  17 Nov 2022 2:40 PM GMT
Next Story