Telugu Global
National

సస్పెన్స్‌కు తెర..ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా విష్ణుదేవ్ సాయ్‌

బీజేపీ అగ్రనేత రమణ్‌సింగ్‌ను సీఎంగా ఎంపిక చేయకుంటే ఓబీసీని సీఎం చేస్తారని మొదట ప్రచారం జరిగింది. ఐతే ఈ ప్రచారాలను పక్కన పెట్టిన బీజేపీ వ్యూహాత్మకంగా గిరిజన నేతను సీఎంగా ఎంపిక చేసింది.

సస్పెన్స్‌కు తెర..ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా విష్ణుదేవ్ సాయ్‌
X

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి ఎవరన్న సస్పెన్స్‌కు తెరదించింది బీజేపీ అధిష్టానం. కేంద్ర మాజీ మంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్‌ విష్ణు దేవ్‌ సాయ్‌ను ఛత్తీస్‌గఢ్‌ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. రాయ్‌పూర్‌లో ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశం అనంతరం ఈ మేరకు ప్రకటన చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నార్త్ ఛత్తీస్‌గఢ్‌లోని కుంకూరి నుంచి సాయ్‌ విజయం సాధించారు. నార్త్ ఛత్తీస్‌గఢ్‌లోని అన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.

విష్ణుదేవ్‌ సాయ్‌..దుర్గ్‌, రాయ్‌పూర్‌, బిలాస్‌పూర్‌ డివిజన్లలో బలమైన సామాజికవర్గంగా ఉన్న సాహు కమ్యూనిటికీ చెందిన వారు. ఛత్తీస్‌గడ్‌లోని 90 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 54 స్థానాలు గెలిచింది. 2018 ఎన్నికల్లో 68 స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌ ఈ సారి 35 స్థానాలకే పరిమితమైంది.

బీజేపీ అగ్రనేత రమణ్‌సింగ్‌ను సీఎంగా ఎంపిక చేయకుంటే ఓబీసీని సీఎం చేస్తారని మొదట ప్రచారం జరిగింది. ఐతే ఈ ప్రచారాలను పక్కన పెట్టిన బీజేపీ వ్యూహాత్మకంగా గిరిజన నేతను సీఎంగా ఎంపిక చేసింది. ఐతే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ జనాభాలో 32 శాతం షెడ్యూల్ తెగలకు చెందిన వారున్నారు.

ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఐతే ఇవాళ ఛత్తీస్‌గఢ్‌ సీఎంను ప్రకటించిన బీజేపీ అధిష్టానం..మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రులను ఫైనల్ చేయాల్సి ఉంది.

First Published:  10 Dec 2023 1:30 PM GMT
Next Story