Telugu Global
National

లాకప్ డెత్ లలో బీజేపీ పాలిత రాష్ట్రాలదే అగ్రస్థానం!

మన దేశంలో లాకప్ మరణాల్లో బీజేపీ పాలిత‌ రాష్ట్రాలే ముందున్నాయి. ఈ రెండు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 4,484 లాకప్ డెత్ లు నమోదయ్యాయి.

లాకప్ డెత్ లలో బీజేపీ పాలిత రాష్ట్రాలదే అగ్రస్థానం!
X

భారత దేశంలో లాకప్ మరణాలు పెరుగుతున్నాయి. ప్రతీ ఏటా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తప్ప తగ్గడం లేదు. కోర్టులు మొట్టికాయలు వేసినా, మానవ హక్కుల సంఘాలు ఆందోళనలు నిర్వహించినా పోలీసుల తీరు మాత్రం మారడం లేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించిన లెక్కల ప్రకారమే ఈ రెండేళ్ళలో 4,484 లాకప్ డెత్ లు నమోదయ్యాయి. హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపిన వివరాల ప్రకారం 2020, 21 సంవత్సరంలో 1940 లాకప్ డెత్ లు జరగగా 2020, 21 లో 2544 లాకప్ డెత్ లు జరిగాయి.

ఇక ఈ లాకప్ డెత్ లలో బీజేపీ పాలిత రాష్ట్రాలదే అగ్రస్థానం. అందులోనూ యోగీ రాజ్యమైన ఉత్తరప్రదేశ్ ది మొదటి స్థానం. 2020-21లో, ఉత్తరప్రదేశ్‌లో 451 కస్టడీ మరణాలు నమోదయ్యాయి. 2021-22లో ఈ సంఖ్య 501కి పెరిగింది. రెండేళ్ళలో ఈ సంఖ్య 952.

మధ్యప్రదేశ్ లో రెండేళ్ళలో 364, బీహార్ లో 396, మహా రాష్ట్రలో 340, హర్యాణా లో 158, గుజరాత్ లో 135, పశ్చిమ బెంగాల్ లో 442, తమిళనాడు లో 172 మంది లాకప్ డెత్ లకు గురయ్యారు.

ఈ లాకప్ డెత్ ల విషయంలో కూడా కులము, మతము, పేదరికము చాలా ప్రాధాన్యత చూపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఈ రెండేళ్ళలో జరిగిన 952లాకప్ డెత్ లలో అత్యధిక భాగం ముస్లింలే అని ఉత్తరప్రదేశ్‌కు చెందిన న్యాయవాది అనాస్ తన్వీర్ అన్నారు. అదే తమిళనాడు ఎక్కువ లాకప్ డెత్ లో మరణించింది దళితులే అని లెక్కలు చెప్తున్నాయి.

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పోలీసులకు ఇచ్చిన విశేష అధికారాలు కూడా ఈ లాకప్ డెత్ లకు కారణమవుతున్నాయనే ఆరోపణలున్నాయి.

ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా లాకప్ డెత్ ల సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం ఈ రెండేళ్ళలో ఆంధ్రప్రదేశ్ లో 98 లాకప్ డెత్ లు, తెలంగాణలో 48 లాకప్ డెత్ లు జరిగాయి.


First Published:  28 July 2022 11:23 AM GMT
Next Story