Telugu Global
National

బీజేపీ ఎమ్మెల్యేకి 25 ఏళ్ల జైలుశిక్ష..

ఈ కేసుపై విచారణ చేపట్టిన సోనభద్ర ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు రామదులారేని దోషిగా తేల్చింది. అతనికి 25 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించింది.

బీజేపీ ఎమ్మెల్యేకి 25 ఏళ్ల జైలుశిక్ష..
X

కామంతో కళ్లు మూసుకుపోయి ఓ బాలికపై అత్యాచారానికి పాల్ప‌డిన బీజేపీ ఎమ్మెల్యేకి న్యాయస్థానంలో సరైన శిక్షపడింది. సదరు ఎమ్మెల్యేకి 25 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. శుక్రవారం ఇచ్చిన ఈ తీర్పుపై దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు న్యాయం కోసం పోరాడిన బాధితురాలి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని దుద్ది అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన గిరిజన ఎమ్మెల్యే రామదులారే గోండ్‌. ఆ ప్రాంతంలో బలమైన నాయకుడిగా పేరున్న రామదులారేకు బీజేపీ.. దుద్ది అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్‌ ఇవ్వటంతో అక్కడ పోటీ చేసి గెలుపొందాడు. అయితే.. 2014 నవంబర్‌ 4న అతను ఓ మైనర్‌ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో ఆమె కుటుంబసభ్యులు అతనిపై మయోర్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోపక్క ఈ ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ సదరు ఎమ్మెల్యే బాధితురాలి సోదరుడిపై బెదిరింపులకు దిగాడు. ఏడాదిపాటు అతన్ని ఈ విషయమై వేధించాడు.



ఈ కేసుపై విచారణ చేపట్టిన సోనభద్ర ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు రామదులారేని దోషిగా తేల్చింది. అతనికి 25 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించింది. జరిమానాగా విధించిన సొమ్మును అత్యాచార బాధితురాలికి అందించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసుపై తీర్పును కోర్టు అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి అహ్సన్‌ ఉల్లా ఖాన్‌ వెలువరించారు. రామదులారేకి కోర్టులో శిక్షపడటంతో బీజేపీ అతనిపై అనర్హత వేటు వేసింది.

First Published:  16 Dec 2023 2:20 AM GMT
Next Story