Telugu Global
National

'త్రివ‌ర్ణ పతాకానికి పబ్లిసిటి అవసరమా ?'

ప్రధాని మోడీ ఇచ్చిన హ‌ర్ ఘ‌ర్ తిరంగా నినాదం ఆయన న‌వీన్ జిందాల్ నుంచి స్ఫూర్తి పొందారా ? అవుననే అంటున్నారు జిందాల్

త్రివ‌ర్ణ పతాకానికి పబ్లిసిటి అవసరమా ?
X

'ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అట్ట‌హాసంగా ప్రారంభించిన హ‌ర్ ఘ‌ర్ తిరంగా నినాదం ఆయ‌న సొంతం కాదా?దానికి ద‌శాబ్దాల నాడే పునాది ప‌డిందా? ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త, మాజీ ఎంపి న‌వీన్ జిందాల్ నుంచి ప్ర‌ధాని మోడీ స్ఫూర్తి పొందారా ?

'హ‌ర్ ఘ‌ర్ తిరంగా అంటూ జ‌రుగుతున్న విస్తృత ప్ర‌చారం సంద‌ర్భంలో పాశ్చాత్య సంస్కృతిని అనుస‌రిస్తున్నారంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్ర‌ముఖ పారి|శ్రామిక వేత్త, మాజీ ఎంపీ నవీన్ జిందాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త్రివర్ణ పతాకాన్ని గౌర‌వించ‌డం, విధేయ‌త చూప‌డ‌మే ప్ర‌ధానం త‌ప్ప ప్రచారం అవ‌స‌రం లేద‌న్నారు.

"ప్రతి దేశానికి దాని సొంత‌ సంస్కృతి, విలువలు ఉన్నాయి. మన జాతీయ పతాకాన్ని గౌరవించటానికి మనకు చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ జెండాకు గౌరవం, మ‌ర్యాద ఇవ్వ‌డం అత్యంత ప్రధానమని భావిస్తున్నాను. ఈ విష‌యంలో ఎన్నటికీ రాజీపడకూడదు. జెండాను ప్రదర్శించే హక్కు కోసం మేము పోరాడినప్పుడు కూడా ఇలాంటి వాదనలే వచ్చాయి. ప్రతి భారతీయుడు తిరంగను ప్రేమిస్తాడు. దానికి తగిన గౌరవాన్ని ఇస్తాడు" అని జిందాల్ అన్నారు.

త్రివర్ణ పతాకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జిందాల్ ముందు వరుసలో ఉన్నారు. ఒక భారతీయుడు భారతదేశంలో జాతీయ జెండాను ఎందుకు ప్రదర్శించకూడదు? అని 1992లో ఆయ‌న ప్ర‌శ్నించిన‌పుడు పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది. దీనిపై దాదాపు దశాబ్దం పాటు న్యాయ‌పోరాటం సాగింది. దీని ఫలితంగా 2004 లో సుప్రీం కోర్టు చ‌రిత్రాత్మ‌క తీర్పునిచ్చింది. ప్రతి భారతీయుడికి యేడాది పొడ‌వునా అన్ని రోజుల్లో జాతీయ జెండాను ప్రదర్శించే ప్రాథమిక హక్కు ఉంద‌ని పేర్కొంది.

"ఆ తీర్పు తర్వాత, నేను 2005లో నా భార్య షల్లూ జిందాల్‌తో కలిసి ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించాను. ప్ర‌తీ భారతీయుడూ తిరంగా ప్రదర్శించేలా ప్రాచుర్యంలోకి తీసుకువ‌చ్చాం. అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న‌ అపోహ‌ల‌ను తొల‌గిస్తూ ప్ర‌తీ భార‌తీయుడు ఎంతో గ‌ర్వంగా జాతీయ‌ప‌తాకాన్ని ప్ర‌ద‌ర్శించ‌వ‌చ్చ‌నే సందేశాన్నిదేశానికి పంపించ‌గ‌లిగాము. తిరంగా సందేశాన్ని, విలువలను ప్రతి భారతీయుడికి అందించడంలో మేము విజయం సాధించామని నేను నమ్ముతున్నాను. అయితే దీనికి చాలా సమయం పట్టినా మార్పును చూడ‌గ‌లుగుతున్నాము. క్రీడా విజయం నుండి పర్వత యాత్ర వరకు, పబ్లిక్ బిల్డింగ్‌ల నుండి చిన్న మార్కెట్ ప్రదేశాల వరకు, పాఠశాల ఫంక్షన్‌ల నుండి సెల్ఫీ పాయింట్ల వరకు, భారతీయులు నిజంగా జాతీయ జెండాపై తమ ప్రేమ గౌర‌వం, విశ్వాసాన్ని చూపుతున్నారు. ఈ భావ‌న అంద‌రినీ స‌మైక్యంగా ఉంచుతుంద‌ని న‌మ్ముతున్నాను."అన్నారాయన.

'హర్ ఘర్ తిరంగా' ప్రచారాన్ని చేపట్టేందుకు కేంద్రం తీసుకున్న చర్యను జిందాల్ ప్రశంసించారు. "తిరంగా దేశంలోని ప్రతి ఇంటికి చేరుకోవడం నా కల నిజమైంది" అని ఆయన చెప్పారు.

First Published:  14 Aug 2022 8:58 AM GMT
Next Story