Telugu Global
National

టాలీవుడ్ Vs కోలీవుడ్.. ముదురుతున్న 'వారసుడు' వివాదం!

దిల్ రాజు నిర్మించిన వారసుడు మూవీ టాలీవుడ్, కోలీవుడ్ ల మధ్య విబేదాలకు కారణమయ్యింది. ముందు స్ట్రెయిట్ చిత్రాలకు థియేటర్లు కేటాయించి, ఆ తర్వాతే డబ్బింగ్ చిత్రాలకు థియేటర్లు ఇవ్వాలని తెలుగు నిర్మాతల మండలి డిమాండ్ చేయడంతో కోలీవుడ్ నిర్మాతలు మండిపోతున్నారు.

టాలీవుడ్ Vs కోలీవుడ్.. ముదురుతున్న వారసుడు వివాదం!
X

తమిళ స్టార్ విజయ్ హీరోగా, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం వారసుడు సినిమా ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ల మధ్య వివాదానికి కారణమయ్యింది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ తమిళ‍ంలో వరిసు పేరుతో వస్తోంది. ఇది తమిళంలో స్ట్రెయిట్ మూవీకాగా తెలుగులోకి డబ్ చేస్తున్నారు.

చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' చిత్రాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఈ సినిమాలతో పాటు దిల్ రాజు 'వారసుడు' సినిమాకు ఎక్కువ థియేటర్లు కేటాయించనున్నారనే వార్తలు వస్తున్నాయి..

ఈ నేపథ్యంలో.. తెలుగు సినీ నిర్మాతల మండలి అధికారికంగా స్పందించింది. గతంలో దిల్ రాజు చెప్పిన మాటలు. ఇప్పుడు కూడా అమలు చేయాలని కోరారు. సంక్రాంతి, దసరా వంటి పండుగలకు విడుదలయ్యే సినిమాల విషయంలో, ముందు స్ట్రెయిట్ చిత్రాలకు థియేటర్లు కేటాయించాలని, ఆ తర్వాతే డబ్బింగ్ చిత్రాలకు థియేటర్లు ఇవ్వాలని నిర్మాతల మండలి అభ్యర్థించింది. దీనిపై ఇప్పుడు పెద్ద రచ్చ జరుగుతోంది.

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి వచ్చిన ఈ అధికారిక ప్రకటన ఇప్పుడు తమిళ దర్శకుల ఆగ్రహానికి కారణమవుతోంది. మా సినిమాలకు థియేటర్లు ఇవ్వకుంటే.. మీ సినిమాలకు కూడా ఇవ్వం.. అంటూ కొందరు కోలీవుడ్ దర్శకులు మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రకటిస్తున్నారు.. ఈ వివాదం మరింత ముదురుతోంది. ఇక్కడ (కోలీవుడ్) తెలుగు సినిమాలను మేము ఆదరిస్తున్నప్పుడు మీరు మాత్రం తమిళ సినిమాలను ఎందుకు ఆపాలి? అని తమిళ సినీ పరిశ్రమ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

మరో వైపు ఈ అంశంపై నిర్మాత అల్లు అరవింద్ వ్యాఖ్యలు తెలుగు నిర్మాతల మండలికి షాక్ కలిగించాయి. నిర్మాతల మండలి నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేయడమే కాక డబ్బింగ్ సినిమాలను ఆపడం సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

First Published:  19 Nov 2022 10:52 AM GMT
Next Story