Telugu Global
National

ప్రజల సమస్యల గురించి కాదు లవ్ జీహాద్ గురించి ఆలోచించండి... కార్యకర్తలకు బీజేపీ నాయకుడి పిలుపు

కర్నాటకలో బీజేపీ కార్యకర్తల కోసం జరిగిన 'బూత్‌ విజయ్‌ అభియాన్’ అనే కార్యక్రమంలో ఆ పార్టీ కర్నాటక అధ్యక్షుడు నళిన్ కటీల్ మాట్లాడుతూ, మీరు ఊరికే రోడ్లు బాగాలేవు, మురికి కాలువలు బాగాలేవు, తదితర‌ చిన్న చిన్న సమస్యల గురించిమాట్లాడొద్దు. లవ్ జీహాద్ గురించి ఆలోచించండి. మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటే, మీరు 'లవ్ జిహాద్'ని ఆపాలనుకుంటే, మీకు బిజెపి అవసరం. లవ్ జిహాద్‌ను వదిలించుకోవడానికి, మీకు బిజెపి అవసరం, ”అని తన ప్రసంగంలో అన్నాడు.

ప్రజల సమస్యల గురించి కాదు లవ్ జీహాద్ గురించి ఆలోచించండి... కార్యకర్తలకు బీజేపీ నాయకుడి పిలుపు
X

ప్రజల సమస్యల గురించికాక ప్రజల మధ్య విభేదాల మీదనే రాజకీయ క్రీడను ఆడే భారతీయ జనతా పార్టీ ఆ విషయాన్ని ఎప్పటి కప్పుడు బైటపెట్టుకుంటూనే ఉంటుంది. ప్రజలకు అవసరమైన ఉద్యోగాలు, వైద్యం , విద్య, వ్యవసాయం తదితర సమస్యలను పరిష్కరించి వాటి ఆధారంగా ఓట్లడగడం కాకుండా హిందూ, ముస్లిం, గుడులు గోపురాలు, లవ్ జీహాదీ, కూల గొట్టడాలు, కట్టే బట్ట, తినే ఆహారం ఆధారంగా విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజలను విడదీసి ఓట్లు దండుకోవడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. ఆ విషయాన్నే ఆ పార్టీ ముఖ్యనాయకుడొకరు బహిరంగంగానే ప్రకటించారు.

కర్నాటకలో బీజేపీ కార్యకర్తల కోసం జరిగిన 'బూత్‌ విజయ్‌ అభియాన్’ అనే కార్యక్రమంలో ఆ పార్టీ కర్నాటక అధ్యక్షుడు నళిన్ కటీల్ మాట్లాడుతూ, మీరు ఊరికే రోడ్లు బాగాలేవు, మురికి కాలువలు బాగాలేవు, తదితర‌ చిన్న చిన్న సమస్యల గురించిమాట్లాడొద్దు. లవ్ జీహాద్ గురించి ఆలోచించండి. మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటే, మీరు 'లవ్ జిహాద్'ని ఆపాలనుకుంటే, మీకు బిజెపి అవసరం. లవ్ జిహాద్‌ను వదిలించుకోవడానికి, మీకు బిజెపి అవసరం, ”అని తన ప్రసంగంలో అన్నాడు.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేధించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించిన నళిన్ కటీల్ “పిఎఫ్‌ఐని నిషేధించకుంటే, ఈ రోజు మన ఈ వేదికపై బిజెపి నాయకులు మోనప్ప భండారి, హరి కృష్ణ బంట్వాల్ (దక్షిణ కన్నడ) ఉండేవారు కాదు. ఎమ్మెల్యే వేదవ్యాస్ కామత్ కూడా ఇక్కడ ఉండేవారు కాదు. వారి ఫోటోలపై దండ మాత్రమే ఉండేది, ”అని అన్నాడు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా “వరుస హత్యలు” ప్లాన్ చేసిందని నళిన్ ఆరోపించారు.

కాగా నళిన్ కటీల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. కటీల్ ప్రసంగానికి సంబంధించిన వీడియోను కర్ణాటక కాంగ్రెస్ ట్వీట్ చేస్తూ, “... రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి, విద్య చిన్న సమస్యలా ? అభివృద్ధి గురించి మాట్లాడవద్దని బిజెపి తన పార్టీ కార్యకర్తలను కోరడం సిగ్గుచేటు.'' అని వ్యాఖ్యానించింది.

“ఇది పరమ చెత్త . వారు (బీజేపీ) అభివృద్ధిని కాం క్షించడం లేదు, ద్వేషం కోరుకుంటున్నారు. దేశాన్ని విభజించాలని చూస్తున్నారు.వారు కేవలం ప్రజల భావోద్వేగాలతో ఆటలాడుకుంటున్నారు. మాకు ఉద్యోగాలు కావాలి, ధరలు పెరుగొద్దని మాము కోరుకుంటున్నాం. ప్రజల రోజువారీ జీవితం గురించి మేము ఆందోళన చెందుతున్నాము.'' అని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డి.కె. శివకుమార్ అన్నారు.

కాగా రామజన్మ భూమి వివాదం అయిపోయాక బీజేపీ దేశవ్యాప్తంగా లవ్ జీహాదీని తన అస్త్రంగా మార్చుకుంది. ముస్లిం యువకులు హిందూ స్త్రీలను లోబర్చుకొని మతం మారుస్తున్నారని ఆరోపిస్తూ దానికి వ్యతిరేకంగా పోరాడాలని హిందూ యువకులను రెచ్చగొడుతోంది. నిజానికి దేశంలో లవ్ జీహదీ అనే ఆరోపణలకు ఎటువంటి ఆధారం ఇప్పటి వరకు దొరకలేదు. ఒక ఊహా జనిత సమస్యను వారే సృష్టించి, దాని పరిష్కార మార్గాన్ని వారే సూచించి ప్రజలను రెచ్చగొట్టి, విడగొట్టి ఓట్లు సంపాదించుకోవడం అనే ఒక ఎన్నికల కళను అమలు పరుస్తున్నారు.

పైగా అనేక బిజెపి పాలిత రాష్ట్రాలు లవ్ జిహాద్ వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చాయి. కర్ణాటకలో కూడా హిందూ మితవాద సంఘాలు ఆ చట్టం కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాల్లో మతాంతర జంటలను వేధించడానికి, ముస్లిం పురుషులను కటకటాల వెనక్కి నెట్టడానికి ఈ చట్టాలు ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి.

First Published:  4 Jan 2023 9:28 AM GMT
Next Story