Telugu Global
National

"ఇండియా" నిలబడేనా? కాంగ్రెస్‌పై కూటమిలో విముఖత

5 రాష్ట్రాల్లో గెలిచి కూటమిపై మరింత పట్టు సాధించాలని కాంగ్రెస్‌ పార్టీ భావించింది. కానీ, అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అందుకే కూటమితో కలిసి నడిచేందుకు ప్రతిపక్ష పార్టీలు ఆలోచిస్తున్నాయనే చర్చ జరుగుతోంది.

ఇండియా నిలబడేనా? కాంగ్రెస్‌పై కూటమిలో విముఖత
X

సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించిన 5 రాష్ట్రాల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని మళ్లీ కష్టాల్లోకి నెట్టాయి. ఆ పార్టీ నాయకత్వం వహిస్తున్న ‘ఇండియా’ కూటమి మనుగడ సైతం ప్రశ్నార్థకంగా మారింది. కూటమికి పెద్దన్నల్లా ఉన్న కాంగ్రెస్‌, ఉత్తరాదిలో 4 రాష్ట్రాల్లో ఓడిపోయింది. ఇది కూటమిపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా ఇవాళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఇంట్లో జరగాల్సిన "ఇండియా" కూటమి భేటీ వాయిదా పడింది.

జాతీయస్థాయిలో పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ రోజు రోజుకూ పడిపోతోంది. దీంతో ఆ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమితో కలిసి రావడానికి విపక్షాలు ఆసక్తి చూపడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటిదేమీ లేదు, వివిధ కారణాల వల్ల కూటమి నేతలు ఈ భేటీకి హాజరు కాలేదని కాంగ్రెస్ చెబుతోంది. ప్రతిపక్షనేతలందరినీ సంప్రదించి ఈనెల 27న లేక 28న మీటింగ్ నిర్వహిస్తామంటోంది.

మరింత బలంగా NDA కూటమి

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల‌ ఎన్నికల కారణంగా కూటమి సమావేశాన్ని నిర్వహించలేకపోయినట్టు కాంగ్రెస్‌ చెబుతోంది. 5 రాష్ట్రాల్లో గెలిచి కూటమిపై మరింత పట్టు సాధించాలని కాంగ్రెస్‌ పార్టీ భావించింది. కానీ, అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అందుకే కూటమితో కలిసి నడిచేందుకు ప్రతిపక్ష పార్టీలు ఆలోచిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. మొత్తానికి సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే రెండుసార్లు ఘనవిజయం సాధించి ఊపు మీదుంది బీజేపీ. ఈ 5 రాష్ట్రాల ఫలితాలతో మరింత బలం పుంజుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో బీజేపీని "ఇండియా" కూటమి ఎలా నిలువరించబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

First Published:  6 Dec 2023 6:03 AM GMT
Next Story