Telugu Global
National

గుడ్లు, మాంసం ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు టాప్..

పశుసంవర్థక రంగంలోని పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తిలో ఐదు రాష్ట్రాలు మంచి ఫలితాలు కనబరిచాయని నాబార్డు నివేదిక వెల్లడించింది. కొవిడ్‌ సంక్షోభంలోనూ ఆయా రాష్ట్రాలు ఈ ఘనత సాధించాయని తెలిపింది.

గుడ్లు, మాంసం ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు టాప్..
X

దేశవ్యాప్తంగా గుడ్లు, మాంసం ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు టాప్ 5 స్థానాల్లో ఉన్నాయి. గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక మాంసం ఉత్పత్తిలో ఏపీ, తెలంగాణ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్ మాత్రమే రెండిటి ఉత్పత్తిలో టాప్ 5 స్థానాల్లో నిలిచింది.

పశుసంవర్థక రంగంలోని పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తిలో ఐదు రాష్ట్రాలు మంచి ఫలితాలు కనబరిచాయని నాబార్డు నివేదిక వెల్లడించింది. కొవిడ్‌ సంక్షోభంలోనూ ఆయా రాష్ట్రాలు ఈ ఘనత సాధించాయని తెలిపింది. గుడ్ల ఉత్పత్తిలో టాప్‌ ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉండగా, తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో టాప్-5 లిస్ట్ లో ఉన్న ఐదు రాష్ట్రాలు గుడ్ల ఉత్పత్తిలో 64.77 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఆయా రాష్ట్రాలు కోవిడ్‌ సమయంలో పశు సంవర్థక, వ్యవసాయ కార్యకలాపాలు నిలిచిపోకుండా అవసరమైన చర్యలను తీసుకోవడంవల్లే ఈ ఘనత సాధించినట్లయిందని నాబార్డ్ తెలిపింది.

మాంసం ఉత్పత్తిలో తొలి ఐదు స్థానాల్లో ఉన్న మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఏపీ, తెలంగాణ మొత్తం 57శాతం ఉత్పత్తిని అందిస్తున్నాయి. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు పశుసంవర్థక రంగంలో అధిక ప్రభుత్వ పెట్టుబడులు అవసరమని సూచించింది నాబార్డు నివేదిక. పాలు, పాల ఉత్పత్తుల్లో భారత్‌, ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని పేర్కొంది. ఇటీవల కాలంలో శాస్త్రీయ, ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా దేశంలో పశువుల ఉత్పత్తి పెరిగినట్టు ఆ నివేదిక పేర్కొంది.

మరోవైపు.. వ్యవసాయ రంగంలో పశుసంవర్థక రంగం వాటా దేశంలో భారీగా పెరిగినట్లు నివేదిక తెలిపింది. 1950–51లో వ్యవసాయ రంగంలో పశు సంవర్థక విభాగం వాటా 17.95 శాతం ఉండగా 2020–21 నాటికి అది 30.13 శాతానికి పెరిగింది. వ్యవసాయ రంగం స్థిరత్వానికి పశువుల రంగం చాలా ముఖ్యమైనదిగా నివేదిక స్పష్టం చేసింది.

First Published:  24 Feb 2023 5:06 PM GMT
Next Story