Telugu Global
National

యూపీలో దారుణం: ప్రేమికులను చంపి చెట్టుకు వేలాడదీశారు

Teenage couple killed, bodies hung from tree in Uttar Pradesh
X

యూపీలో దారుణం: ప్రేమికులను చంపి చెట్టుకు వేలాడదీశారు

దళిత వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించడమే ఆ అమ్మాయి చేసిన పాపం. తమ కుమార్తె దళితుడిని ప్రేమించడంతో తమ పరువు పోయిందని ఆమె తల్లిదండ్రులు భావించారు. ముందు యువకుడిని దారుణంగా హత్య చేశారు. అంతటితో వారి కోపం చల్లారలేదు. కన్న కూతురు అని కూడా చూడకుండా ఆమెను కూడా దారుణంగా అంతమొందించారు. ఈ అమానుష సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ లో జరిగింది.

జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 19 సంవత్సరాల యువకుడు, అగ్రకులానికి చెందిన 17 ఏళ్ల బాలిక ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇటీవల బాలిక కుటుంబ సభ్యులకు తెలిసింది. దళిత కులానికి చెందిన యువకుడిని తమ కుమార్తె ప్రేమించడం ఆ తల్లిదండ్రులకు నచ్చలేదు. పరువు పోయినట్లుగా భావించారు. తమ కుమార్తెను ప్రేమలోకి లాగిన యువకుడిని చంపేయాలని నిర్ణయించుకున్నారు.

బాలిక తల్లిదండ్రులు, బంధువులు యువకుడిని కిడ్నాప్ చేసి మామిడి తోటలోకి తీసుకువచ్చారు. అక్కడ అతడిని చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. అంతటితో ఆగని తల్లిదండ్రులు బాలికను కూడా మామిడి తోట వద్దకు తీసుకువచ్చారు. కన్న కుమార్తె అని కూడా జాలి చూపించలేదు. ఆమెను కూడా దారుణంగా హతమార్చారు.

ఆ తర్వాత ఈ నేరం తమ మీద పడకూడదని ప్లాన్ వేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఇద్దరి మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు. మంగళవారం మామిడి తోటలోకి వచ్చిన కొందరికి మృతదేహాలు ఉరికి వేలాడుతూ కనిపించాయి. వారిచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

అమ్మాయి కుటుంబ సభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. పోలీసులు బాలిక తండ్రి సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి గురువారం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రేమికులను హత్య చేసి చెట్టుకు వేలాడదీసిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

First Published:  12 May 2023 6:14 AM GMT
Next Story