Telugu Global
National

తమిళనాడు సీఎం, గవర్నర్ వాగ్వాదం... అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్

గవర్నర్ తన ప్రసంగంలో ద్రవిడ రాజకీయాలను 'తిరోగమన రాజకీయాలు'గా అభివర్ణించారు. రాష్ట్ర పేరును ‘తమిళగం’గా మార్చాలని కూడా గవర్నర్‌ సూచించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో తీవ్ర వాగ్వివాదం జరిగింది.

తమిళనాడు సీఎం, గవర్నర్ వాగ్వాదం... అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్
X

తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి ఈ రోజు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని కాకుండా గవర్నర్ తనకిష్టమొచ్చిన రీతిలో ప్రసంగించడాన్ని అసెంబ్లీ తప్పుబట్టింది. గవర్నర్ ప్రసంగాన్ని రికార్డుల నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్ స్పీకర్ ను కోరారు.

గవర్నర్ తన ప్రసంగంలో ద్రవిడ రాజకీయాలను 'తిరోగమన రాజకీయాలు'గా అభివర్ణించారు. రాష్ట్ర పేరును ‘తమిళగం’గా మార్చాలని కూడా గవర్నర్‌ సూచించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో తీవ్ర వాగ్వివాదం జరిగింది.

గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఇతర మిత్రపక్షాలు సభను‍ంచి వాకౌట్ చేశాయి. డీఎంకే సభ్యులు గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అయినప్పటికీ గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంలోని ద్ర‌విడ నేత‌ల గురించి ప్ర‌స్తావించ‌లేదు. అంబేద్క‌ర్‌, ద్ర‌విడ మోడ‌ల్‌కు చెందిన విష‌యాల‌ను ఆయ‌న చ‌ద‌వ‌లేదు. ప్ర‌సంగంలో ఉన్న 65వ పేరాకు చెందిన స్పీచ్‌ను గ‌వ‌ర్న‌ర్ విస్మ‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ద్ర‌విడార్ ఖ‌జ‌గం వ్య‌వ‌స్థాప‌కుడు పెరియార్‌, రాజ్యాంగ నిర్మాత అంబేద్క‌ర్‌, మాజీ సీఎం కామ‌రాజ్‌, అన్నాదురైల గురించి ఉన్న వ్యాఖ్య‌ల‌ను గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగం స‌మ‌యంలో స్కిప్ చేశారు.

దాంతో ముఖ్యమంత్రి స్టాలిన్, ఇతర డీఎంకే మంత్రులు, ఎమ్మెల్యేలు గవర్నర్ పై తీవ్రంగా విరుచుకపడ్డారు. గ‌వ‌ర్న‌ర్‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీలో నినాదాలు హోరెత్తాయి. క్విట్ త‌మిళ‌నాడు అని స్లోగ‌న్స్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఐడియాల‌జీని త‌మ‌పై రుద్ద వ‌ద్దు అని డీఎంకే ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.

గవర్నర్ ప్రసంగాన్ని రికార్డులనుంచి తొలగించాలని, రాష్ట్ర ప్ర‌భుత్వం రాసి ఇచ్చిన ప్ర‌సంగాన్ని మాత్రమే రికార్డులోకి తీసుకోవాల‌ని స్టాలిన్ స్పీకర్ ను కోరారు. దాంతో గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేశారు.

డీఎంకేకు, గవర్నర్ కు కొంతకాలంగా తీవ్ర ఘర్షణ వాతావరణం నెల‌కొంది. గత గురువారం, డిఎంకె కోశాధికారి, సీనియర్ నాయకుడు టిఆర్ బాలు, గవర్నర్ రవి తరచుగా చేస్తున్న విభజించే ప్రకటనలకు వ్యతిరేకంగా ఒక ప్రకటన విడుదల చేశారు. “అతను సందర్భంతో సంబంధం లేకుండా సనాతన ధర్మం, ఆర్యనిజం, ద్రావిడవాదం, తిరుక్కురల్, వలసవాదం గురించి తప్పుడు, ప్రమాదకరమైన ప్రకటనలు చేస్తాడు. అంతే కాదు అతను దళితులను, బిఆర్ అంబేద్కర్‌ను కూడా కించపరిచే ప్రకటనలు చేస్తాడు. అయితే, అతని అసలు ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవడం కష్టం కాదు’’ అన్నాడు బాలూ.

డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ, “తమిళనాడు అనే పేరు, మన భాష, సంప్రదాయం, రాజకీయాలు మన జీవన విధానాన్ని సూచిస్తుంది. అన్నాదురై రాష్ట్ర అసెంబ్లీలో తమిళనాడు పేరును అధికారికంగా ప్రకటించారు . ఈ భూమి ఎప్పటికీ తమిళనాడుగానే ఉంటుంది.'' అని అన్నారామె.

First Published:  9 Jan 2023 8:16 AM GMT
Next Story