Telugu Global
National

'స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డ్స్-2022 : మూడో స్థానం కోల్పోయిన విజ‌య‌వాడ

భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో గత సంవత్సరం మూడో స్థానంలో నిలిచిన విజయవాడ తన స్థానాన్ని కోల్పోయింది. వరుసగా ఆరవ సారి ఇండోర్ మొదటి స్థానంలో రాగా సూరత్, నవీ ముంబై లు రెండవ, మూడవ స్థానాల్లో నిలిచాయి.

స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డ్స్-2022 : మూడో స్థానం కోల్పోయిన విజ‌య‌వాడ
X

ఇండోర్ వరుసగా ఆరవ సారి భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఎంపికైంది. సూరత్, నవీ ముంబై తదుపరి రెండు స్థానాల్లో నిలిచాయి. శ‌నివారంనాడు కేంద్ర ప్ర‌భుత్వం 'స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డ్స్ 2022' లో ప్ర‌క‌టించింది. కేంద్ర ప్రభుత్వ వార్షిక స్వచ్ఛత సర్వేలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల కేటగిరీలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఈ ఏడాది పెద్ద నగరాల విభాగంలో ఇండోర్‌, సూరత్‌ అగ్రస్థానాలను నిలబెట్టుకోగా, మూడో స్థానంలో ఉన్న విజ‌య‌వాడ త‌న స్థానాన్ని ఈ యేడాది కోల్పోయింది. ఆ స్థానంలో నవీ ముంబై చేరింది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం విజేతలకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి త‌దిత‌రులు పాల్గొన్నారు.

వంద‌ కంటే తక్కువ మునిసిపాలిటీ సంస్థలను కలిగి ఉన్న రాష్ట్రాల్లో, సర్వే ఫలితాల ప్రకారం, త్రిపుర మొదటి స్థానంలో నిలిచింది. లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల కేటగిరీలో, మహారాష్ట్రలోని పంచగని మొదటి స్థానంలో ఉంది, ఛత్తీస్‌గఢ్‌లోని పటాన్, మహారాష్ట్రలోని కర్హాద్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. స్వచ్ఛ్ సర్వేక్షణ్ 7వ ఎడిషన్ స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) పురోగతిని అధ్యయనం చేయడానికి, వివిధ పరిశుభ్రత, పారిశుద్ధ్య పారామితుల ఆధారంగా పట్టణ స్థానిక సంస్థలకు (ULBలు) ర్యాంక్ ఇవ్వడానికి ఈ స‌ర్వే నిర్వహించారు.

First Published:  1 Oct 2022 1:57 PM GMT
Next Story