Telugu Global
National

పిల్లలు 7కే వెళ్తుంటే మనం ఎందుకు రాలేం? - సుప్రీం

ఒక కేసులో బెయిల్ విచారణ సందర్భంగా సాధారణ పనివేళ కంటే గంట ముందుగానే యూయూ లలిత్ తో కూడిన ధర్మాసనం సమావేశమైంది.

పిల్లలు 7కే వెళ్తుంటే మనం ఎందుకు రాలేం? - సుప్రీం
X

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి యూయూ లలిత్ కోర్టు సమయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తదుపరి ప్రధాన న్యాయమూర్తి రేసులో కూడా ఉన్నారు. పిల్లలు ఉదయం 7 గంటలకే స్కూల్ కి వెళ్తున్నప్పుడు మనం ఎందుకు త్వరగా కోర్టును ప్రారంభించకూడదు అని ఆయన ప్రశ్నించారు.

ఒక కేసులో బెయిల్ విచారణ సందర్భంగా సాధారణ పనివేళ కంటే గంట ముందుగానే యూయూ లలిత్ తో కూడిన ధర్మాసనం సమావేశమైంది. ఈ సందర్భంగా బెయిల్ పిటిషన్ పై వాదనలకు హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అభినందించారు. ఉదయం 9:30 కి కోర్టు ప్రారంభం కావడం చాలా మంచి పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. దాంతో స్పందించిన సీనియర్ న్యాయమూర్తి లలిత్.. పిల్లలు ఉదయం 7గంటలకే స్కూల్ కి వెళ్తున్నప్పుడు మనం ఎందుకు ఉదయం 9 గంటలకే కోర్టు పనులను ప్రారంభించకూడదు అని ప్రశ్నించారు. ఉదయం 9 గంట‌ల‌కే కోర్టును ప్రారంభించడం వల్ల సాయంత్రం చాలా సమయం దొరుకుతుందని ఆ సమయంలో ఫైళ్లను పరిశీలించడం వంటి వాటికి అవకాశం ఉంటుందని లలిత్ వ్యాఖ్యానించారు.

ఉదయం 9 గంటలకే కోర్టు పనిచేయడం ప్రారంభించి 11.30కి అరగంట పాటు విరామం తీసుకుని, తిరిగి కోర్టు పనిచేస్తే మధ్యాహ్నం రెండు కల్లా కేసుల విచారణ పూర్తి చేయవచ్చని, ఆ తర్వాత మరుసటి రోజుకు సంబంధించిన కేస్ ఫైళ్లను పరిశీలించేందుకు సమయం ఉంటుందని వ్యాఖ్యానించారు. దాంతో స్పందించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ఆగస్టు నెల నుంచి ఈ మార్పును తాము చూడవచ్చు అని ఆశిస్తున్నామన్నారు.

ఆగస్టు 26 తో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ పదవీ విరమణ చేయబోతున్నారు. ఆ తర్వాత ఆ స్థానంలోకి లలిత్ రాబోతున్నారు. అందుకే ఆగస్టు నుంచి తాము ఈ మార్పు చూస్తామని అనుకుంటున్నామని న్యాయవాది వ్యాఖ్యానించినట్టు భావిస్తున్నారు. న్యాయమూర్తులు కేసుల విచారణను ఉదయం 10:30 నుంచి 4 గంటల వరకు కొనసాగిస్తూ ఉంటారు.

First Published:  15 July 2022 11:57 AM GMT
Next Story