Telugu Global
National

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు

అవినీతిపరులే దేశాన్ని ధ్వంసం చేస్తారని సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖలు చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని సుప్రీం కోర్టు ప్రస్తావించింది.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
X

''ప్రజాప్రతినిధులను కొనేయడానికి కోట్ల రూపాయలు ఇస్తామని కొందరు మాట్లాడిన‌ వీడియోను చూశాం. దేశాన్ని ధ్వంసం చేస్తున్నది అటువంటి అవినీతిపరులే. వారి మీద ఎవరైనా చర్యలు తీసుకుంటున్నారా ?వారిపట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నాం.'' అని సుప్రీం కోర్టులో జస్టిస్‌ జోసెఫ్, జస్టిస్ హృషికేష్ రాయ్ ల ధర్మాసనం వ్యాఖ్యానించింది.

భీమా కోరేగావ్ కేసులో నిందితుడు, మానవహక్కుల కార్యకర్త, జర్నలిస్టు గౌతమ్ నవ‌లఖా పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తన ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకొని కొంత కాలమైనా తనను గృహనిర్బంధంలో ఉంచాలని నావలఖా కోర్టును కోరారు. దీనిని వ్యతిరేకించిన ఎన్‌ఐఏ తరఫున వాదించిన ఏఎస్జీ రాజు గౌతమ్‌ గృహనిర్బంధాన్ని వ్యతిరేకించారు. ఆయనకు ఐసిస్ తో సంబంధాలున్నాయని, దేశాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి, భీమా కోరేగావ్ నిందితులు దేశాన్ని ధ్వంసం చేస్తారని అనుకోవడంలేదని, నిజానికి దేశాన్ని ధ్వంసం చేసేది అవినీతి పరులు అని వ్యాఖ్యానించిన ధర్మాసనం తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారాన్ని ప్రస్తావించింది. గౌతమ్‌ 70 ఏళ్ల వృద్ధుడని, చరమ దశలో ఉన్నారని, ఆయనకు తాము బెయిల్‌ ఇవ్వడం లేదని, గృహ నిర్బధం గురించి మాత్రమే మాట్లాడుతున్నామని తెలిపింది.

2020 అక్టోబర్ లో చార్జ్ షీట్ దాఖలు చేసినప్పటికీ విచారణ ఇంత ఆలస్యం అవడ‍ం పట్ల ధర్మాసనం విచారం వ్యక్తంచేసింది. ఈ సందర్భంగా గౌతమ్ నవ‌లఖా గృహనిర్బంధం అంశాన్ని పరిగణలోకి తీసుకున్నామని చెప్పిన జస్టిస్‌ జోసెఫ్‌ మీరు ఎలాంటి ఆంక్షలైనా పెట్టుకోవచ్చని ఎన్ ఐ ఏ కు సూచించింది. ఆయన చర్మవ్యాధితో పాటు అనేక జబ్బులతో బాధపడుతున్నారని ఆయనను తన . సోదరి నివాసానికి తరలించాల్సిందిగా నావలఖా తరపున న్యాయ‌వాది కపిల్‌ సిబాల్ వాదించారు. ఆయనను వైద్యపరీక్షలు చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోర్టును సిబాల్ అడగగా, వైద్య పరీక్షలు చేయించుకునేందుకు నవంబర్ 29న నవలఖాకు అనుమతి ఇచ్చింది సుప్రీం కోర్టు. గురువారం దీనిపై తీర్పు వెలువడే అవకాశం ఉంది.

కాగా ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కుట్ర వ్యవహారం వీడియోను సుప్రీం కోర్టు జడ్జీలందరికీ పంపానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విషయం గమనార్హం.

First Published:  10 Nov 2022 3:04 AM GMT
Next Story