Telugu Global
National

మద్యం లైట్‌గా తీసుకుంటే మంచిదే అంటగా - సుప్రీంకోర్టు

ఢిల్లీలో మద్యం ఉత్పత్తి, పంపిణి, వినియోగంపై నియంత్రణ కోరుతూ అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఓ పిటిషన్ వేశారు. సిగరెట్ ప్యాకెట్ల మీద ఆరోగ్యానికి హానికరం అని ముద్రించినట్లు.. మద్యం బాటిళ్లపై కూడా స్టిక్కర్లు వేయాలని ఆ పిటిషన్‌లో కోరారు.

మద్యం లైట్‌గా తీసుకుంటే మంచిదే అంటగా - సుప్రీంకోర్టు
X

మద్యం వినియోగంపై సుప్రీంకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మద్యం పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచితే అని కొందరు చెప్తుంటారు కదా అని శుక్రవారం ఓ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో మద్యం ఉత్పత్తి, పంపిణి, వినియోగంపై నియంత్రణ కోరుతూ అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఓ పిటిషన్ వేశారు. సిగరెట్ ప్యాకెట్ల మీద ఆరోగ్యానికి హానికరం అని ముద్రించినట్లు.. మద్యం బాటిళ్లపై కూడా స్టిక్కర్లు వేయాలని ఆ పిటిషన్‌లో కోరారు. ఆ పిటిషన్ ఇవ్వాళ చీఫ్ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్. రవీంద్రభట్, జస్టిస్ ఇందిరా బెనర్జీతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది విధానపరమైన నిర్ణయమని, సుప్రీంకోర్టు ఏమీ చేయలేదని స్పష్టం చేసింది.

మద్యం హానికరమని అని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు, బాటిల్స్‌పై స్టిక్కర్లు కూడా వేయాల‌ని కోరారు. దీని వల్ల యువతకు మేలు జరుగుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. మద్యం లైట్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చాలా మంది నమ్ముతారు. అయితే సిగరెట్ల విషయంలో మాత్రం ఇంత వరకు ఎవరూ అలా చెప్పలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇదొక విధానపరమైన నిర్ణయం, సుప్రీంకోర్టు ఏమీ చేయలేదు. ఈ పిటిషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని లేకపోతే మేమే కొట్టేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

కాగా, ఈ విషయంలో లా కమిషన్‌ను సంప్రదించడానికి తనకు అనుమతి ఇవ్వాలని అడ్వకేట్ కోరారు. అయితే, కేసు ఉపసంహరించుకోవడానికి మాత్రమే అనుమతి ఇస్తామని.. అలా చేయకపోతే కొట్టేస్తామని పేర్కొంది. కాగా, ఈ నెల మొదట్లో కూడా సుప్రీంకోర్టు ఇలాంటి పిటిషన్‌కు కొట్టేసింది. మద్య నియంత్రణ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేయగా.. విధానపరమైన నిర్ణయాల్లో సుప్రీం జోక్యం చేసుకోదని పిటిషన్ కొట్టేసింది.

First Published:  23 Sep 2022 2:41 PM GMT
Next Story