Telugu Global
National

జ‌ల్లిక‌ట్టు నిర్వ‌హ‌ణ‌కు సుప్రీంకోర్టు ప‌చ్చ‌జెండా

జల్లికట్టు తమిళనాడు సాంస్కృతిక వారసత్వంలో భాగమని శాసనసభ ప్రకటించినప్పుడు, న్యాయవ్యవస్థ భిన్నమైన అభిప్రాయాన్ని తీసుకోదని జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు సంద‌ర్భంగా పేర్కొంది.

జ‌ల్లిక‌ట్టు నిర్వ‌హ‌ణ‌కు సుప్రీంకోర్టు ప‌చ్చ‌జెండా
X

త‌మిళ‌నాడు రాష్ట్ర సంప్ర‌దాయ క్రీడ జ‌ల్లిక‌ట్టు నిర్వ‌హ‌ణ‌కు సుప్రీం కోర్టు గురువారం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. జల్లికట్టు నిర్వ‌హ‌ణ‌పై తమిళనాడు చట్టాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. దీంతో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఊర‌ట ల‌భించింది. జంతు హింస చట్టం ఈ ఆటకు వర్తించదని ధ‌ర్మాస‌నం తెలిపింది. ఈ మేరకు 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం సవరించింది. తమిళ సంస్కృతిలో జల్లికట్టు ఓ భాగమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను న్యాయ‌స్థానం కొట్టేసింది.

జల్లికట్టు తమిళనాడు సాంస్కృతిక వారసత్వంలో భాగమని శాసనసభ ప్రకటించినప్పుడు, న్యాయవ్యవస్థ భిన్నమైన అభిప్రాయాన్ని తీసుకోదని జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు సంద‌ర్భంగా పేర్కొంది. దీనిపై తమిళనాడు న్యాయశాఖ మంత్రి ఎస్‌.ర‌ఘుప‌తి స్పందిస్తూ.. ఈ తీర్పు చరిత్రాత్మకమని పేర్కొన్నారు.

తమిళనాడులో పొంగల్ పండుగ సమయంలో సంప్రదాయకంగా ఈ ఆట ఆడతారు. జల్లికట్టు అనేది ఎద్దులను మచ్చిక చేసుకునే క్రీడ. ఈ క్రీడలో యువకులు ఎద్దును వీలైనంత ఎక్కువ సేపు పట్టుకుని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారు.

పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA)తో సహా జంతు హక్కుల సంఘాలు రాష్ట్రంలో ఈ క్రీడను అనుమతించే తమిళనాడు ప్రభుత్వ చట్టాన్ని సవాలు చేశాయి. జల్లికట్టు జంతువుల పట్ల క్రూరమైనదని, దానిని నిషేధించాలని వాదించాయి.

First Published:  18 May 2023 8:29 AM GMT
Next Story