Telugu Global
National

కోర్టును బెదిరించాలనుకుంటున్నారా..? – న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం

మీరు సాధారణంగా ఎక్కడ ప్రాక్టీస్‌ చేస్తారు.. గొంతు పెంచడం ద్వారా కోర్టును బెదిరించలేరు.. నా 23 ఏళ్ల కెరీర్‌లో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. నా పదవి ఆఖరి సంవత్సంలోనూ ఇలాంటి పరిస్థితి రాకూడదు.

కోర్టును బెదిరించాలనుకుంటున్నారా..? – న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం
X

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఓ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది గట్టిగా మాట్లాడటంపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. గొంతు తగ్గించాలని ఈ సందర్భంగా ఆయన్ని హెచ్చరించారు. కోర్టును బెదిరించాలనుకుంటున్నారా..? అంటూ మండిపడ్డారు. సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా బుధవారం ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ స్పందిస్తూ.. మీరు సాధారణంగా ఎక్కడ ప్రాక్టీస్‌ చేస్తారు.. గొంతు పెంచడం ద్వారా కోర్టును బెదిరించలేరు.. నా 23 ఏళ్ల కెరీర్‌లో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. నా పదవి ఆఖరి సంవత్సంలోనూ ఇలాంటి పరిస్థితి రాకూడదు. గొంతు తగ్గించండి. దేశంలోని తొలి కోర్టులో మీరు వాదించే విధానం ఇదేనా.. ఎల్లప్పుడూ ఇలాగే జడ్జిల దగ్గర అరుస్తూ ఉంటారా..? అంటూ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ న్యాయవాది సీజేఐకి క్షమాపణలు చెప్పారు.

న్యాయవాదులు సంయమనంతో వ్యవహరించాలంటూ సీజేఐ హెచ్చరించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ ఇలాగే మాట్లాడటంతో తగ్గాలని సీజేఐ హెచ్చరించారు. గతేడాది అక్టోబరులో కోర్టు హాలులో ఓ న్యాయవాది ఫోనులో మాట్లాడటం చూసి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదేమైనా మార్కెట్టా.. ఫోన్‌లో మాట్లాడుకోవడానికి అని మండిపడ్డారు. అప్పుడే న్యాయవాదుల ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని కోర్టు అధికారులను ఆదేశించడం గమనార్హం.

First Published:  4 Jan 2024 6:00 AM GMT
Next Story