Telugu Global
National

కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోలేం.. - జమ్మూకశ్మీర్‌ అంశంపై సుప్రీంకోర్టు

జమ్మూకశ్మీర్‌ కు సార్వభౌమాధికారం లేదని, భారత రాజ్యాంగమే ఫైనల్‌ అని స్పష్టంచేసింది. కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ సవాల్‌ చేయడం సరికాదని పేర్కొంది.

కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోలేం.. - జమ్మూకశ్మీర్‌ అంశంపై సుప్రీంకోర్టు
X

జమ్మూకశ్మీర్‌ విషయంలో ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకున్న నిర్ణయమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం తీర్పు చెప్పింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ 370 ఆర్టికల్‌ను రద్దు చేయడం అనేది యుద్ధ నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని తెలిపింది. కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.


జమ్మూకశ్మీర్‌ కు సార్వభౌమాధికారం లేదని, భారత రాజ్యాంగమే ఫైనల్‌ అని స్పష్టంచేసింది. కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ సవాల్‌ చేయడం సరికాదని పేర్కొంది. అలాగే రాష్ట్రపతి అధికారాలను ప్రతిసారీ న్యాయపరిశీలనకు తీసుకోవడం సాధ్యంకాదని ఈ బెంచ్‌కి నేతృత్వం వహించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్పష్టంచేశారు.

అలాగే జమ్మూకశ్మీర్‌ నుంచి లడాఖ్‌ను పూర్తిగా విభజించి, దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతున్న జమ్మూకశ్మీర్‌కి రాష్ట్ర హోదాను త్వరగా పునరుద్ధరించాలని ఈ సందర్భంగా కేంద్రానికి తెలిపింది. జమ్మూకశ్మీర్‌లో 2024 సెప్టెంబరు 30లోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

First Published:  11 Dec 2023 1:01 PM GMT
Next Story