Telugu Global
National

స్టే ఉత్తర్వులు వాటంతట అవే రద్దు కావు.. - సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్ మిశ్రా తరఫున జస్టిస్‌ ఏఎస్‌ ఓకా ఒక తీర్పు.. జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ మరో తీర్పు రాశారు. రెండు తీర్పులు దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి.

స్టే ఉత్తర్వులు వాటంతట అవే రద్దు కావు.. - సుప్రీంకోర్టు కీలక తీర్పు
X

స్టే ఉత్తర్వుల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సివిల్, క్రిమినల్‌ కేసుల్లో ట్రయల్‌ కోర్టులు, హైకోర్టులు జారీ చేసే స్టే ఉత్తర్వులు ఆరు నెలల తర్వాత వాటంతట అవే రద్దు కావని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టే ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతూ గురువారం ఈ ఆదేశాలు ఇచ్చింది.

2018లో ఆసియన్‌ రీసర్ఫేసింగ్‌ ఆఫ్‌ రోడ్‌ ఏజెన్సీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వర్సెస్‌ సీబీఐ కేసులో ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం, నిర్దిష్ట గడువు ప్రస్తావించకుండా ఉంటే ఆరు నెలల తర్వాత కోర్టులు జారీ చేసిన స్టే ఉత్తర్వులు వాటంతట అవే రద్దు అయిపోతాయని తీర్పిచ్చింది. ఆ తర్వాత ఈ తీర్పు.. సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసే స్టే ఉత్తర్వులకు వర్తించదని సుప్రీంకోర్టు వివరణ ఇచ్చింది. 2018 తీర్పుపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఇందులో జస్టిస్‌ ఏఎస్‌ ఓకా, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్, జస్టిస్‌ మనోజ్ మిశ్రా ఉన్నారు. వాదోపవాదాలు విన్న ఈ ధర్మాసనం తన తీర్పును గత ఏడాది డిసెంబరు 13న రిజర్వులో ఉంచింది. గురువారం తీర్పు ప్రకటించింది.

ఇందులో సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్ మిశ్రా తరఫున జస్టిస్‌ ఏఎస్‌ ఓకా ఒక తీర్పు.. జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ మరో తీర్పు రాశారు. రెండు తీర్పులు దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. 2018 తీర్పును వ్యతిరేకించాయి. రాజ్యాంగంలోని అధికరణ 142 కింద సర్వోన్నత న్యాయస్థానానికి ఉన్న అధికారాలపైనా ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అధికరణ పేరిట హైకోర్టు జారీ చేసే మధ్యంతర ఉత్తర్వులు ఆరు నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు పేర్కొనడం సమంజసం కాదని స్పష్టం చేసింది. హైకోర్టులపై పరిమితులు విధించడం కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని పేర్కొంది. కక్షిదారుల హక్కులకు భంగకరమని తెలిపింది.

రాజ్యాంగ కోర్టు (సుప్రీంకోర్టు, హైకోర్టు)లు.. ఇతర కోర్టుల్లోని కేసుల పరిష్కారానికి కాలపరిమితి విధించకూడదని తాజాగా ధర్మాసనం స్పష్టం చేసింది. అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే అలాంటి ఆదేశాలు జారీ చేయాలని తెలిపింది. కేసుల ప్రాధాన్యతను నిర్ణయించే అధికారం సంబంధిత కోర్టులకే విడిచిపెట్టాలని పేర్కొంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆ న్యాయస్థానాల న్యాయమూర్తులకే తెలుస్తుందని వివరించింది.

First Published:  1 March 2024 5:42 AM GMT
Next Story