Telugu Global
National

జమ్మూలో శ్రీవారి ఆలయ ప్రారంభోత్సవం.. చివరిరోజు విగ్రహ ప్రతిష్ఠాపన, మహాసంప్రోక్షణ

ఆరు రోజుల పాటు వేద పండితుల మంత్రోచ్ఛారణలతో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. చివరి రోజైన గురువారం ధ్వజాహరోహణం, సర్వదర్శన ప్రారంభ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు.

జమ్మూలో శ్రీవారి ఆలయ ప్రారంభోత్సవం.. చివరిరోజు విగ్రహ ప్రతిష్ఠాపన, మహాసంప్రోక్షణ
X

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జమ్మూలోని మాజిన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు విగ్రహ ప్రతిష్ఠాపన, మహా సంప్రోక్షణ కార్యక్రమాల‌కు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, టీటీడీ చైర్మ‌న్ వైవీ.సుబ్బారెడ్డి దంప‌తులు పాల్గొన్నారు. 62 ఎకరాల విస్తీర్ణంలో అందమైన శివాలిక్ అటవీ ప్రాంతంలో జూన్ 3వ తేదీన పుణ్యాహవచనంతో ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలైంది.

ఆరు రోజుల పాటు వేద పండితుల మంత్రోచ్ఛారణలతో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. చివరి రోజైన గురువారం ధ్వజాహరోహణం, సర్వదర్శన ప్రారంభ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ శ్రీవారి ఆలయం జమ్ము ప్రాంతంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా నిలిచింది.

కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, జితేంద్ర సింగ్ తో పాటు జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, స్థానిక ఎంపీ జుగల్ కిశోర్ శర్మ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంప‌తులు, ఎస్వీ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ప్రెసిడెంట్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో పాటు వేద పండితులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

First Published:  8 Jun 2023 4:21 PM GMT
Next Story