Telugu Global
National

జ‌ర్న‌లిస్టు సిద్ధిఖీ కి తీవ్ర‌వాద లింకులు ఉన్నాయి..: సుప్రీంకోర్టులో యూపి ప్ర‌భుత్వం అఫిడ‌విట్

సుప్రీం కోర్టులో కేరళ జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్ బెయిల్ పిటిషన్ ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఆయనకు తీవ్రవాద లింకులున్నాయని ప్రభుత్వం ఆరోపించింది.

జ‌ర్న‌లిస్టు సిద్ధిఖీ కి తీవ్ర‌వాద లింకులు ఉన్నాయి..: సుప్రీంకోర్టులో యూపి ప్ర‌భుత్వం అఫిడ‌విట్
X

జైల్లో ఉన్న కేరళ జర్నలిస్ట్ సిద్ధిఖీ కప్పన్ కు తీవ్ర‌వాద సంస్థ‌ల‌తో సంబంధాలు ఉన్నాయ‌ని ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. సిద్ధిఖీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టులో తీవ్ర అభ్యంతరాలతో అఫిడ‌విట్ దాఖలు చేసింది. సిద్ధిక్ అభ్యర్థన "వైరుధ్యాలతో నిండి ఉంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్ ఐ) విద్యార్థి విభాగం అయిన క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సిఎఫ్ ఐ)తో టెర్రర్ ఫండింగ్, ప్లానింగ్"తో అతనికి స‌న్నిహిత సంబంధాలు" ఉన్నాయని పోలీసు విచారణలో వెల్లడైందని ప్రభుత్వం అఫిడ‌విట్ లో పేర్కొంది.

5 అక్టోబర్ 2020న సిద్ధిఖీ మరో ముగ్గురు ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు వెళుతుండగా వారిని అరెస్టు చేశారు. దళిత మహిళపై అగ్ర‌ కులాల వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై వివ‌రాలు తెలుసుకునేందుకు వెళుతుండగా వారిని అడ్డుకుని పోలీసులు అరెస్టు చేశారు. ఆయ‌న బెయిల్ పిటిష‌న్ గ‌త విచార‌ణ‌లో యుపి ప్ర‌భుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. దానికి ప్ర‌తిగా ప్ర‌భుత్వం ఈ అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. కాగా, సెప్టెంబరు 9వ తేదీన సిద్ధిఖీ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది.

సిద్ధిఖీ 2009 లో దుబాయ్ లో ఉన్న‌ప్పుడు గ‌ల్ఫ్ తేజ‌స్ డైలీలో ప‌నిచేసిన‌ట్టు చెప్ప‌లేద‌ని . పోలీసులు అత‌ని రెజ్యూమ్ చూసిన‌ప్పుడు ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయ‌ని పేర్కొంది. తేజస్ "ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ ఐ)" యొక్క మలయాళ మౌత్ పీస్ అని ప్రభుత్వం పేర్కొంది. మ‌త‌క‌ల్లోల‌లాకు కార‌ణ‌మ‌వుతోంద‌ని 2018లో భారతదేశంలో మూసివేశార‌ని తెలిపింది. ఒసామా బిన్ లాడెన్ ను అమ‌ర‌వీరుడ‌ని కీర్తిస్తూ ప్ర‌చురిత‌మైన పేప‌ర్‌ను జ‌త చేసింది. అలాగే ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌ను స‌మ‌ర్ధించింద‌ని అటువంటి ప‌త్రిక‌ల‌తో ద‌శాబ్దానికి పైగా అత‌నికి సంబంధాలు ఉన్నాయ‌ని వివ‌రించింది.

ఇలా సిద్ధిఖీ బెయిల్ ను అడ్డుకునేందుకు ఏడు కార‌ణాల‌ను చూపింది. అత‌ను నిజంగా హ‌త్రాస్ ఘ‌ఠ‌ట‌న‌ను క‌వ‌ర్ చేయ‌డానికి వెళ్ళిన‌ట్ట‌యితే ఇత‌ర కేసుల్లో ఉన్న నిందితుల‌తో క‌లిసి వెళ్ళాల్సిన ప‌ని ఏమిటి, పైగా అత‌ని వ‌ద్ద అప్పుడు ప్రెస్ క్ల‌బ్ గుర్తింపు కార్డుతో పాటు తేజ‌స్ ఐడి కార్డు మాత్ర‌మే ఉన్నాయి. అదీగాక అత‌ను ఫ్రీలాన్స‌ర్ గా ప‌నిచేస్తున్న‌ట్టు చెబుతున్న అజిముఖుం ప‌త్రిక అత‌నిని ఈ హ‌త్రాస్ ఘ‌ట‌న క‌వ‌ర్ చేయ‌మ‌ని పుర‌మాయించ‌లేదు అని పేర్కొంది. సిద్ధిఖీ సంతృప్తిక‌ర‌మైన జ‌వాబులు ఇవ్వ‌డం లేద‌ని సుప్రీం కోర్టుకు తెలిపింది.

First Published:  6 Sep 2022 11:45 AM GMT
Next Story