Telugu Global
National

శ్రద్ధా కేసు వల్లే తునిషాకు బ్రేకప్ చెప్పా.. పోలీసులకు షీజాన్ వాంగ్మూలం

పోలీసుల విచారణలో షీజాన్ ఖాన్ కీలక వాంగ్మూలం ఇచ్చాడు. శ్రద్ధా వాకర్ కేసు కారణంగానే తునిషాకు బ్రేకప్ చెప్పినట్లు షీజాన్ పోలీసులకు చెప్పాడు.

శ్రద్ధా కేసు వల్లే తునిషాకు బ్రేకప్ చెప్పా.. పోలీసులకు షీజాన్ వాంగ్మూలం
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ కేసు వల్లే తాను తునిషా శర్మకు బ్రేకప్ చెప్పానని నటుడు షీజాన్ ఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. ఈనెల 24వ తేదీ టీవీ నటి తునిషా శర్మ(20) షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసు సంచలనం సృష్టించింది. ఆమె సహచర టీవీ నటుడు అయిన షీజాన్ ఖాన్ ప్రేమలో ఉందని, అతడు బ్రేకప్ చెప్పిన కారణంగానే తునిషా ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి.

తన కూతురును ప్రేమ పేరుతో నాలుగు నెలలపాటు షీజాన్ ఖాన్ వాడుకున్నాడని, తన కూతురితో ప్రేమలో ఉంటూనే.. అతడు మరో యువతితో ప్రేమాయణం సాగించాడని తునిషా తల్లి వనిత విమర్శించింది. అతడు బ్రేకప్ చెప్పడంతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆత్మహత్య ప్రేరేపించిన నేరం కింద షీజాన్ ఖాన్ ను అరెస్టు చేశారు.

తాజాగా పోలీసుల విచారణలో షీజాన్ ఖాన్ కీలక వాంగ్మూలం ఇచ్చాడు. శ్రద్ధా వాకర్ కేసు కారణంగానే తునిషాకు బ్రేకప్ చెప్పినట్లు షీజాన్ పోలీసులకు చెప్పాడు. తునిషాది వేరే మతం కావడం, తనకు ఆమెకు 8 ఏళ్ల గ్యాప్ ఉండడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని భావించి ఆమెకు బ్రేకప్ చెప్పినట్లు తెలిపారు. శ్రద్ధా వాకర్ కేసు తనపై తీవ్ర ఒత్తిడి పెంచిందని, అందువల్లే బలవంతంగా తునిషాకు బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందని షీజాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. తునిషా గతంలో కూడా ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించగా.. తానే కాపాడానని.. తనని జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె తల్లికి చెప్పినట్లుగా పోలీసులకు వివరించాడు.

శ్రద్ధా వాకర్ మరణం తర్వాత దేశవ్యాప్తంగా లవ్ జిహాదీ కోణం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు కూడా అటువంటిదేనని మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ ఇటీవల ఆరోపణలు చేశారు.కాగా శ్రద్ధా వాకర్ పేరు చెప్పి షీజాన్ కేసు నుంచి తెలివిగా తప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడన్న విమర్శలు కూడా వస్తున్నాయి.

First Published:  26 Dec 2022 5:20 PM GMT
Next Story