Telugu Global
National

శ్ర‌ద్ధా హత్య కేసు: ఆఫ్తాబ్ ప్ర‌యాణిస్తున్న వాహ‌నంపై కత్తులతో హిందూ సంఘాల దాడి

ఆఫ్తాబ్ ను జైలుకు తీసుకెళ్తుండ‌గా హిందూత్వ‌వాదులు దాడి చేసిన‌ట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. త‌మ వ్యానుకు అడ్డంగా దుండ‌గులు వారి వాహ‌నాన్ని ఆపి అందులో నుంచి ఐదుగురు వ్య‌క్తులు క‌త్తుల‌తో దూకి త‌మ వాహ‌నాన్ని ల‌క్ష్యంగా చేసుకుని దూసుకొచ్చార‌ని పోలీసులు తెలిపారు.

శ్ర‌ద్ధా హత్య కేసు: ఆఫ్తాబ్ ప్ర‌యాణిస్తున్న వాహ‌నంపై కత్తులతో హిందూ సంఘాల దాడి
X

ఢిల్లీలో శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హత్య చేసిన నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా ప్రయాణిస్తున్న పోలీసు వ్యాన్‌పై సోమ‌వారంనాడు సాయంత్రం కత్తులు ఇత‌ర మార‌ణాయుధాల‌తో కొంద‌రు దాడి చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారని, పూనావాలా క్షేమంగా ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి.

ఈ దాడికి తామే బాధ్యుల‌మంటూ హిందూ సేన అనే సంస్థ ప్ర‌క‌టించింది. హిందూ యువతిని అఫ్తాబ్ ఎలా ముక్కలు చేసాడో దేశం మొత్తం చూస్తోందని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు.

పూనావాలాను అతని రెండవ పాలిగ్రాఫ్ పరీక్ష తర్వాత పశ్చిమ ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నుండి పోలీసు వ్యాన్ లో తిరిగి జైలుకు తీసుకెళ్తుండ‌గా హిందూత్వ‌వాదులు దాడి చేసిన‌ట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. త‌మ వ్యానుకు అడ్డంగా దుండ‌గులు వారి వాహ‌నాన్ని ఆపి అందులో నుంచి ఐదుగురు వ్య‌క్తులు క‌త్తుల‌తో దూకి త‌మ వాహ‌నాన్ని ల‌క్ష్యంగా చేసుకుని దూసుకొచ్చార‌ని పోలీసులు తెలిపారు. వెంట‌నే స్పందించిన పోలీసులు త‌మ ఆయుధాల‌తో ఎదురుదాడికి దిగ‌డంతో ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేద‌ని పోలీసులు తెలిపారు. దాడి చేసిన వారిలో నిగమ్ గుజ్జర్, కుల్దీప్ ఠాకూర్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామ‌ని, వారు గురుగ్రామ్ నివాసితులని పేర్కొన్నారు. తాము హిందూ సేన సభ్యులమని వారు చెప్పార‌ని పోలీసులు ధృవీకరించారు.

ఆఫ్తాబ్ త‌న ప్రియురాలు శ్ర‌ద్ధా వాక‌ర్ తో వాగ్వాదం జ‌రిగిన త‌ర్వాత ఆమెను హ‌త్య చేసి ముక్క‌లుగా న‌రికి వేర్వేరు ప్రాంతాల్లో ప‌డేసిన‌ట్టు కోర్టులో అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. శ్ర‌ద్ధాకు చెందిన 20 అవ‌య‌వ భాగాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని డిఎన్ ఎ ప‌రీక్ష‌కు పంపారు.

అయితే అతని పోలీసు రిమాండ్ పొడిగింపు గురించి విచారణ జరుగుతున్నందున అది సాక్ష్యంగా పరిగణించబడదు. పాలిగ్రాఫ్ పరీక్ష ఫలితాలు లేదా తర్వాత నిర్వహించబడే నార్కో-విశ్లేషణ కూడా కోర్టులో ఆమోదయోగ్యం కాదంటున్నారు. ఈ కేసులో ప్రాథమిక సాక్షులు ఎవ‌రూ లేరు. ప్రస్తుతం, దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ భయంకరమైన నేరానికి సంబంధించి సంద‌ర్భోచిత సాక్ష్యాధారాలు మాత్రమే పోలీసుల వద్ద ఉన్నాయి. కాగా, పూనావాలాను తీహార్ జైలులో 24 గంటలూ కెమెరా నిఘాలో ఉంచారు.


First Published:  28 Nov 2022 4:36 PM GMT
Next Story