Telugu Global
National

ఎన్డీఏకు షాక్.. కూటమి నుంచి ఆ పార్టీ అవుట్..!

పశుపతి పరాస్‌ 2019లో హాజీపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి రామ్‌ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని LJP తరపున లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే తర్వాత రామ్‌ విలాస్ పాశ్వాన్‌ చనిపోయారు.

ఎన్డీఏకు షాక్.. కూటమి నుంచి ఆ పార్టీ అవుట్..!
X

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్డీఏ కూటమికి షాకిచ్చారు రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ చీఫ్‌ పశుపతి పరాస్‌. మోడీ కేబినెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. బిహార్‌లో సీట్ల పంపకాల విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు పశుపతి పరాస్‌.

చిరాగ్‌ పాశ్వాన్ పార్టీ లోక్‌ జనశక్తి ఎన్డీఏలో చేరింది. దీంతో సోమవారం బీజేపీ, జేడీయూ, LJPల మధ్య సీట్ల పంపకాలు జరిగాయి. బిహార్‌లో బీజేపీ 17, జేడీయూ16, ఎల్‌జేపీ 5 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. మరో రెండు స్థానాలను హిందుస్థాన్ అవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్‌ మంచ్‌ పార్టీలకు కేటాయించారు. అయితే పశుపతి పరాస్ నేతృత్వంలోని RLJPకి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. మీడియా కథనాల ప్రకారం.. ప్రస్తుతం పశుపతి పరాస్‌.. లాలు ప్రసాద్ నేతృత్వంలోని RJDతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రెండు పార్టీల మధ్య చర్చలు జరిగే అవకాశాలున్నాయి.

పశుపతి పరాస్‌ 2019లో హాజీపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి రామ్‌ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని LJP తరపున లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే తర్వాత రామ్‌ విలాస్ పాశ్వాన్‌ చనిపోయారు. తర్వాత పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్‌, పశుపతి పరాస్‌ల మధ్య విబేధాలు రావడంతో ఆయన రాష్ట్రీయ లోక్‌జనశక్తి పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టుకున్నారు. పలువురు ఎంపీలతో కలిసి ఎన్డీఏలో చేరడంతో పశుపతి పరాస్‌కు కేంద్రమంత్రి పదవి దక్కింది. అయితే తాజాగా కూటమిలో చిరాగ్‌ను చేర్చుకున్న ఎన్డీఏ.. పశుపతి పరాస్‌కు ఒక్క స్థానం కూడా కేటాయించలేదు. దీంతో ఆయన ఎన్డీఏను వీడారు. పశుపతి పరాస్‌ ఇండియా కూటమిలో చేరితే.. ఆర్జేడీ తన కోటా నుంచి RJLPకి సీట్లు కేటాయించాల్సి ఉంటుంది.

First Published:  19 March 2024 7:14 AM GMT
Next Story