Telugu Global
National

కత్తులు నూరండి.... హిందువులకు బీజేపీ ఎంపీ పిలుపు

"మీ ఇళ్లలో ఆయుధాలు ఉంచండి. కనీసం కూరగాయలు కోసేందుకు ఉపయోగించే కత్తులనైనా పదును పెట్టాలి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలియదు. ప్రతి ఒక్కరికి స్వీయ రక్షణ హక్కు ఉంది. ఎవరైనా మన ఇంట్లోకి చొరబడి దాడి చేస్తే వారిని ఎదుర్కోవడం మన హక్కు. కత్తులు కూరగాయలను ఎలా కోస్తాయో, అవి తలలను కూడా అలాగే కోస్తాయి " అని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ప్రజలను రెచ్చగొట్టారు.

కత్తులు నూరండి.... హిందువులకు బీజేపీ ఎంపీ పిలుపు
X

''హిందువులు కత్తులకు పదును పెట్టండి. కత్తులను ఎప్పుడూ ఇళ్ళల్లో ఉంచుకోండి. మనపై, మన గౌరవంపై దాడి చేసే వారికి బుద్ది చెప్పాలి. మన అమ్మాయిలను రక్షించుకోవాలి. ఇది మన హక్కు'' అని బీజేపీకి చెందిన భోపాల్ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు.

కర్ణాటకలోని శివమొగ్గలో ఆదివారం జరిగిన హిందూ జాగరణ వేదిక దక్షిణ ప్రాంత వార్షిక సదస్సులో ఆమె మాట్లాడుతూ లవ్ జీహాద్ పై మండి పడ్డారు.

"లవ్ జిహాద్.... వీరికి జిహాద్ సంప్రదాయం ఉంది. వారికి చేయడానికి ఏమీ లేకపోతే లవ్ జిహాద్ చేస్తారు. ప్రేమించినా అందులో జిహాద్ చేస్తారు. మనం (హిందువులు) కూడా ప్రేమిస్తాం. మనం దేవుడిని ప్రేమిస్తాం. సన్యాసి దేవుడిని ప్రేమిస్తాడు. కానీ భగవంతుడు సృష్టించిన ఈ ప్రపంచంలో, అణచివేసేవారిని, తప్పు చేసేవారిని, పాపులందరినీ అంతం చేయండి, లేకపోతే, ప్రేమకు నిజమైన నిర్వచనం ఇక్కడ మనుగడ సాగించదు అని సన్యాసి అంటాడు. కాబట్టి లవ్ జిహాద్‌లో పాల్గొన్న వారికి అదే విధంగా సమాధానం చెప్పండి. మీ అమ్మాయిలను రక్షించండి, వారికి సరైన విలువలు నేర్పండి.'' అని ప్రజ్ఞా ఠాకూర్ అన్నారు.

శివమొగ్గలో బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యను ప్రస్తావిస్తూప్రజ్ఞా ఠాకూర్, "మీ ఇళ్లలో ఆయుధాలు ఉంచండి. కనీసం కూరగాయలు కోసేందుకు ఉపయోగించే కత్తులనైనా పదును పెట్టాలి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలియదు. ప్రతి ఒక్కరికి స్వీయ రక్షణ హక్కు ఉంది. ఎవరైనా మన ఇంట్లోకి చొరబడి దాడి చేస్తే వారిని ఎదుర్కోవడం మన హక్కు. కత్తులు కూరగాయలను ఎలా కోస్తాయో, అవి తలలను కూడా అలాగే కోస్తాయి "అని ఆమె అక్కడ చేరిన ప్రజలను రెచ్చగొట్టారు..

తమ పిల్లలను మిషనరీలు నిర్వహించే సంస్థలలో చదివించవద్దని తల్లిదండ్రులకు సలహా ఇచ్చారామె. "మిషనరీలకు పంపడం ఆపండి. ఇలా చేయడం ద్వారా వృద్ధాశ్రమాల సంస్కృతి పెరుగుతోంది. పిల్లలు మీకు, మీ సంస్కృతికి దూరమవుతారు. వృద్ధాశ్రమాల సంస్కృతిలో పెరిగి స్వార్థపరులుగా మారుతున్నారు'' అని ఆమె అన్నారు.

హిందూ జాగరణ వేదిక కర్ణాటక రాష్ట్ర కన్వీనర్ కేశవ మూర్తి మీడియాతో మాట్లాడుతూ ప్రజ్ఞా మాటల్లో ఎలాంటి తప్పు లేదని అన్నారు. "ఆమె ఎలాంటి రెచ్చగొట్టే ప్రకటన చేయలేదు. ఆమె చెప్పింది ఏమిటంటే, ఎవరైనా దాడి చేస్తే, తమను తాము రక్షించుకునే స్థితిలో మనం ఉండాలి… మన (హిందూ) సంస్కృతి ఎవ్వరిపై దాడి చేయాలని చెప్పదు. కానీ మరొకరు దాడి చేసినప్పుడు మనల్ని మనం రక్షించుకోవాలి, "అని మూర్తి అన్నారు.

ఈ విధంగా రెచ్చగొట్టే, ద్వేషం వ్యాపింపజేసే వ్యాఖ్యలు చేయడం ప్రజ్ఞా ఠాకూర్ కు కొత్త కాదు. ఈ విధమైన మాటలతోనే ఆమె ప్రసిద్ది చెందారు. మహారాష్ట్ర లోని మాలేగావ్ పేలుళ్ళ కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు. అనారోగ్యం కారణాలు చూపి ఆమె బెయిల్ పై బైటికి వచ్చారు. ఆ తర్వాత ఎంపీగా గెలిచారు. ఆపై దేశమంతా తిరుగుతూ మైనార్టీలపై హిందువులను రెచ్చగొడుతూ ప్రసంగాలు చేస్తున్నారు. ఆమె జైలు నుంచి బైటికి రాగానే అనారోగ్యం మటుమాయం అయ్యింది.

First Published:  27 Dec 2022 2:24 AM GMT
Next Story