Telugu Global
National

బిల్కిస్ బానో కేసు :11 మంది దోషుల విడుదలపై కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు

సంబంధిత పక్షాల నుండి స్పందనలు కోరడమే కాకుండా, దోషులకు రిమిషన్ మంజూరుకు సంబంధించిన‌ ఫైళ్లను సిద్ధంగా ఉంచాలని కూడా సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

బిల్కిస్ బానో కేసు :11 మంది దోషుల విడుదలపై కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు
X

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, తన‌ కుటుంబంలోని ఏడుగురిని హతమార్చిన 11 మంది దోషులని జైలు నుండి విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. కోర్టు కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలకు నోటీసులను జారీ చేసింది.

సంబంధిత పక్షాల నుండి స్పందనలు కోరడమే కాకుండా, దోషులకు రిమిషన్ మంజూరుకు సంబంధించిన‌ ఫైళ్లను సిద్ధంగా ఉంచాలని కూడా సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

న్యాయస్థానం కూడా చట్టం ప్రకారం నడుస్తుందని, కేసును విచారిస్తున్నప్పుడు భావోద్వేగాలకు లోనవబోమని ధర్మాసనం పేర్కొంది. న్యాయమూర్తులు KM జోసెఫ్, BV నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో అనేక సమస్యలు ఉన్నాయని, దానిని వివరంగా వినవలసి ఉందని పేర్కొంది. అనంతరం ఈ కేసును ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేసింది.

ఈ కేసులో దోషులు గుజరాత్ ప్రభుత్వ రిమిషన్ పాలసీ ప్రకారం గతేడాది ఆగస్టు 15న విడుదలయ్యారు.

వీరు విడుదలను సవాలు చేస్తూ బిల్కిస్ బానో సుప్రీం కోర్టును ఆశ్ర‌యించగా చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ కేసు విచారణకు KM జోసెఫ్, BV నాగరత్నలతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.

First Published:  27 March 2023 2:15 PM GMT
Next Story