Telugu Global
National

పారిశుధ్య కార్మికుడిపై బీజేపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి

ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు నిస్పృహ చెందిన బీజేపీ నాయకులు ఇలా దాడులకు తెగబడుతున్నారని AAP ఎమ్మెల్యే కులదీప్ కుమార్ మండిపడ్డారు.

పారిశుధ్య కార్మికుడిపై బీజేపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి
X

ఢిల్లీ బిజెపి ఎమ్మెల్యే అభయ్ వర్మ ఓ పారిశుధ్య కార్మికుడిపై దాడికి దిగాడు. అతను అతని అనుచరులు కార్మికుడిని కొట్టిన వీడియోను AAP ఎమ్మెల్యే కులదీప్ కుమార్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ కార్మికుడిని చుట్టుముట్టిన కొందరు వ్యక్తులు అతన్ని చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు వీడియోలో ఉన్నాయి.

ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు నిస్పృహ చెందిన బీజేపీ నాయకులు ఇలా దాడులకు తెగబడుతున్నారని AAP ఎమ్మెల్యే కులదీప్ కుమార్ మండిపడ్డారు.

కార్మికులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాస్తామని, దళితుడిపై దాడి చేసినందుకు బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని కోరతామని ఆప్ సీనియర్ నేత రాఖీ బిర్లా తెలిపారు.

BJP నేతల‌ చర్యలు దళితుల పట్ల ఆ పార్టీకి ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తోందని, దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని బిర్లా అన్నారు.

అయితే బీజేపీ ఎమ్మెల్యే అభయ్ వర్మ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తనను తాను సమర్దించుకునే ప్రయత్నాలు చేశారు.

"నేను ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, మురికివాడల నివాసితుల కోసం ఉద్దేశించిన టాయిలెట్‌కు తాళం వేసి ఉందని నాకు ఫిర్యాదు వచ్చింది. నేను కార్మికుడిని అడిగినప్పుడు, అతను నన్ను దుర్భాషలాడాడు" అని అతను చెప్పాడు.

''తొలుత తాళం తన వద్ద లేదని చెప్పాడు. అయితే స్థానికులు, నేనూ ఒత్తిడి చేయడంతో తాళం తీసుకొచ్చి మరుగుదొడ్డి తెరిచాడు'' అని ఎమ్మెల్యే చెప్పాడు.

ఈ టాయిలెట్ లో అతను మద్యం కూడా నిల్వ ఉంచుతాడని స్థానికులు చెప్పారని తెలిపారు. టాయిలెట్ ఎందుకు మూసి ఉంచారని అడిగే హక్కు ప్రజాప్రతినిధిగా నాకుందని, భవిష్యత్తులో కూడా మరుగుదొడ్డికి తాళం వేస్తే తప్పకుండా మళ్లీ అక్కడికి వెళతానన్నారు.

అయితే కార్మికుడిపై దాడి జరిగినప్పుడు తానక్కడ లేనని దూరంగా ఉన్నానని చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే.




.

First Published:  29 Dec 2022 3:36 PM GMT
Next Story