Telugu Global
National

డీప్‌ ఫేక్‌లపై భారీ జరిమానా! - కేంద్రం కీలక నిర్ణయం

డీప్‌ ఫేక్‌ వీడియోల కట్టడిపై చర్చించేందుకు కేంద్రం గురువారం కీలక సమావేశం నిర్వహించింది. సోషల్‌ మీడియా సంస్థలు, నాస్కామ్, కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)పై పనిచేసే నిపుణులతో చర్చించింది.

డీప్‌ ఫేక్‌లపై భారీ జరిమానా!  - కేంద్రం కీలక నిర్ణయం
X

డీప్‌ ఫేక్‌ వీడియోలు, ఫొటోలు సృష్టిస్తూ సెలబ్రిటీలు, ప్రముఖ వ్యక్తుల పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వ్యక్తులపై తీవ్ర చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. అలాంటి వీడియోలను సృష్టించేవారికి, వాటిని వ్యాప్తి చేసేందుకు కారణమయ్యే సోషల్‌ మీడియాకు కూడా భారీ జరిమానా విధించే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గురువారం ప్రకటించారు. త్వరలో దీనిపై కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానున్నట్టు మంత్రి వెల్లడించారు.

డీప్‌ ఫేక్‌ వీడియోల కట్టడిపై చర్చించేందుకు కేంద్రం గురువారం కీలక సమావేశం నిర్వహించింది. సోషల్‌ మీడియా సంస్థలు, నాస్కామ్, కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)పై పనిచేసే నిపుణులతో చర్చించింది. సమావేశం అనంతరం కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ డీప్‌ ఫేక్‌ రూపంలో మన ప్రజాస్వామ్యానికి సరికొత్త ముప్పు తీసుకొస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని కట్టడి చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

దీనిపై సోషల్‌ మీడియా సంస్థలతో జరిగిన సమావేశంలో తాము నాలుగు అంశాలపై కీలకంగా చర్చించామని మంత్రి వివరించారు. డీప్ ఫేక్‌లను గుర్తించడం, వాటి వ్యాప్తిని అరికట్టడం, వాటిని నివేదించడం, అవగాహన కల్పించడం వంటి అంశాలపై చర్చలు జరిపామని తెలిపారు. రాబోయే కొన్ని వారాల్లో దీనికి సంబంధించి కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నామని చెప్పారు. ఆ ముసాయిదా రూపకల్పనను నేటి నుంచే ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలను సవరించడమో.. లేకపోతే కొత్త చట్టం తీసుకురావడమో చేస్తామని కేంద్రమంత్రి వెల్లడించారు. డిసెంబరు తొలి వారంలో దీనిపై మరోసారి చర్చిస్తామన్నారు.


First Published:  23 Nov 2023 10:13 AM GMT
Next Story