Telugu Global
National

ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న రవీంద్ర జడేజా భార్య

మూడు సంవత్సరాల కిందటే రీబా బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆమె పార్టీ తరపున యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకుంటున్నారు.

ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న రవీంద్ర జడేజా భార్య
X

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రీబా జడేజా ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌లో వచ్చే నెల 1, 5వ తేదీల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో రీబా పోటీ చేస్తారని సమాచారం. మూడు సంవత్సరాల కిందటే రీబా బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆమె పార్టీ తరపున యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకుంటున్నారు.

రీబా ఎన్నికల్లో పోటీ చేయడం పక్కా అని, ఆమెకు టికెట్ కూడా కన్ఫర్మ్ చేశారనే ప్రచారం జరుగుతోంది. రీబా రాజపుత్‌ల అనుబంధ సంస్థ అయిన కర్ణిసేనలో కొన్నేళ్లపాటు క్రియాశీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత హరి సింగ్ సోలంకీకి రీబా బంధువు కూడా. కాగా ఇవాళ రాత్రిలోగా గుజరాత్ అసెంబ్లీకి పోటీ చేయబోయే మొత్తం 182 మంది అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ జాబితాలో రీబా పేరు కూడా ఉంటుందని జడేజా కుటుంబం ధీమా వ్యక్తం చేస్తోంది.

గుజరాత్‌లో బీజేపీ 27 ఏళ్లుగా అధికారంలో ఉంది. ప్రస్తుతం ఆ పార్టీ ఎప్పుడు లేని విధంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీ వాల్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో బీజేపీ తమ పట్టు నిలుపుకునేందుకు ముమ్మర కృషి చేస్తోంది. ఈసారి ఎక్కువగా యువతకు టికెట్లు కేటాయించాలని భావిస్తోంది. ఇప్పటికే 75 ఏళ్ళు నిండినవారికి టికెట్లు ఇవ్వబోమని అధిష్టానం స్పష్టం చేసింది. యువతకు పెద్ద సంఖ్యలో టికెట్లు కేటాయించే అవకాశం ఉండడంతో రీబా జడేజాతో పాటు హార్దిక్ పటేల్, అల్పేష్ థాకూర్‌లకు బీజేపీ తరపున టికెట్లు కన్ఫర్మ్ అనే ప్రచారం జరుగుతోంది.

First Published:  9 Nov 2022 12:46 PM GMT
Next Story