Telugu Global
National

బాలీవుడ్ పై రాందేవ్ బాబా షాకింగ్ కామెంట్స్

కొన్ని నెలలుగా ఈ వివాదం నుంచి బాలీవుడ్ బయటకు రాలేకపోతోంది. ఈ నేపథ్యంలో యోగా గురువు రాందేవ్ బాబా బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్ పై రాందేవ్ బాబా షాకింగ్ కామెంట్స్
X

ప్రముఖ యోగ గురువు రాందేవ్ బాబా బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ నటులు డ్రగ్స్ వాడతారని ఆయన కామెంట్స్ చేశారు. యువ నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి బాలీవుడ్ ప్రతిష్ట మసక బారింది. సొంతంగా పైకి వచ్చే వాళ్లను బాలీవుడ్ ప్రోత్సహించదన్న విమర్శలు వెళ్ళువెత్తాయి. సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయిన కొన్ని కుటుంబాలు వారి వారసులకు మాత్రమే అండదండలు అందిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.

కొందరు ప్రముఖ దర్శక, నిర్మాతలు కూడా సినీ ఇండస్ట్రీలో పాతుపోయిన కుటుంబాలకే ప్రాధాన్యం ఇస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. సుశాంత్ మరణం తర్వాత సినీ ఇండస్ట్రీలోని కొన్ని కుటుంబాలు, వారికి మద్దతుగా నిలుస్తున్న దర్శక, నిర్మాతలు రూపొందిస్తున్న సినిమాలను ప్రేక్షకులు బాయ్ కాట్ చేస్తున్నారు. సొంతంగా పైకి వచ్చే నటీనటులను ప్రోత్సహించని దర్శక, నిర్మాతల నుంచి వచ్చే సినిమాలను నిషేధించాలని ప్రేక్షకులు పిలుపునిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ వివాదం నుంచి బాలీవుడ్ బయటకు రాలేకపోతోంది. ఈ నేపథ్యంలో యోగా గురువు రాందేవ్ బాబా బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపణలు చేశారు. షారుఖ్ ఖాన్ కొడుకు డ్రగ్స్ తీసుకొని పట్టుబడి జైలుకు కూడా వెళ్లి వచ్చాడని చెప్పారు. ఇక బాలీవుడ్ లోని హీరోయిన్ల గురించి ఆ దేవుడికే తెలుసని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ ఇండస్ట్రీ డ్రగ్స్ మత్తులో కూరుకుపోయిందని రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాల్లో కూడా డ్రగ్స్ అడుగుపెట్టిందని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. డ్రగ్స్, మద్యంలేని భారత్ కోసం అందరూ కృషి చేయాలని, ఇందుకోసం మేం కూడా ఉద్యమం చేస్తామని రాందేవ్ బాబా ప్రకటించారు. కాగా బాలీవుడ్ ఇండస్ట్రీ డ్రగ్స్ మత్తులో కూరుకుపోయిందని బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి.

First Published:  16 Oct 2022 3:09 PM GMT
Next Story