Telugu Global
National

పసలేని టీకా.. రామ్ దేవ్ పైత్యం..

అప్పట్లో విమర్శలతో వెనక్కి తగ్గి కరోనాని క్యాష్ చేసుకోలేక బోల్తాపడ్డ రామ్ దేవ్.. ఇప్పుడు టీకాపై విమర్శలు ఎక్కు పెట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

పసలేని టీకా.. రామ్ దేవ్ పైత్యం..
X

కరోనా వచ్చిన కొత్తల్లో కరోనిల్ అనే నాటుమందుతో ప్రజల్ని బురిడీ కొట్టించాలని చూశారు బాబాగా ప్రచారంలో ఉన్న రామ్ దేవ్. బీజేపీ ప్రభుత్వం వచ్చాక రామ్ దేవ్ వ్యాపార భాగస్వామిగా ఉన్న పతంజలి సంస్థ ఆస్తులు ఏ స్థాయిలో పెరిగాయో అందరికీ తెలుసు. అప్పట్లో విమర్శలతో వెనక్కి తగ్గి కరోనాని క్యాష్ చేసుకోలేక బోల్తాపడ్డ రామ్ దేవ్.. ఇప్పుడు టీకాపై విమర్శలు ఎక్కు పెట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కరోనా వ్యాక్సిన్ వైద్య శాస్త్ర వైఫల్యంగా అభివర్ణించారు రామ్ దేవ్. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ ​లో పతంజలి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా కరోనా బారిన పడ్డారని, అమెరికాను టార్గెట్‌ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రామ్ దేవ్. ప్రపంచానికే తామే చక్రవర్తులమంటూ, తమకంటే గొప్పవారెవరూ లేరనుకోవడం తప్పని అమెరికాకు హితవు పలికారు రామ్ దేవ్. ఈ క్రమంలో భారత్ తయారీ వ్యాక్సిన్ ని కూడా ఆయన చులకన చేశారు.

ప్రపంచం మొత్తం మూలికా వైద్యం వైపు చూస్తోందని అన్నారు రామ్ దేవ్. ప్రజలంతా తమ పెరటిలో తులసి, కలబంద, తిప్ప తీగ మొక్కలను పెంచుతున్నారని, ఈ చెట్లు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని చెప్పుకొచ్చారు. తిప్ప చెట్టుపై పరిశోధనలు చేసి.. మందులు తయారు చేస్తే భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు. కొవిడ్​ చికిత్సలో.. అల్లోపతి ఔషధాల సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వైద్యం వల్లే లక్షలాది మంది ప్రజలు మృత్యువాత పడ్డారని చెప్పారు. రామ్ దేవ్ వ్యాఖ్యలు గంటల వ్యవధిలోనే వైరల్ గా మారడం, ఆ తర్వాత పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆయన వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

First Published:  4 Aug 2022 11:52 AM GMT
Next Story