Telugu Global
National

అమ్మవారి అవతారాన్నంటూ చెల్లి తల నరికేసిన బాలిక..!

దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నా సమాజంలోని మూఢ నమ్మకాలు, విశ్వాసాలు ఇంకా వీడటం లేదు.

అమ్మవారి అవతారాన్నంటూ చెల్లి తల నరికేసిన బాలిక..!
X

దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నా సమాజంలోని మూఢ నమ్మకాలు, విశ్వాసాలు ఇంకా వీడటం లేదు. ఇలాంటి మూఢ నమ్మకాలు ఒక్కోసారి కొందరి జీవితాలను బలి తీసుకుంటున్నాయి. పల్లెల్లో అమ్మవార్లకు పూజలు చేసే సమయంలో అమ్మవారు పూనిందంటూ వింతగా ప్రవర్తిస్తుంటారు. వారి ప్రవర్తన ఆ సమయంలో ఉన్మాదులను తలపిస్తుంటుంది. ఒంట్లోకి అమ్మవారు వచ్చిందంటూ ప్రజలు బిందెలతో నీరు పోయడం, నోట్లో నిమ్మకాయ పెట్టడం చేస్తుంటారు. అయినా వారు ఇవన్నీ లెక్క చేయకుండా కుండా వింతగా ప్రవర్తిస్తుంటారు.

అలా అమ్మవారు ఒంట్లోకి వచ్చిందంటూ ఓ 15 ఏళ్ళ బాలిక కత్తి పట్టుకుని వీరంగం సృష్టించింది. చంపుతానంటూ కత్తి పట్టుకొని ప్రజలను వెంట పడింది. ఈ క్రమంలో కొందరికీ గాయాలు అయ్యాయి. ఆ తర్వాత ఆ బాలిక పిచ్చిపట్టిన దానిలా ప్రవర్తిస్తూ తనకు వరుసకు చెల్లెలు అయ్యే 9 ఏళ్ల బాలిక తల నరికి చంపేసింది.ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఈ సంఘటన రాజస్థాన్ లోని డూన్గర్ పూర్ లో జరిగింది.

జింజ్వ ఫాలా గ్రామానికి చెందిన శంకర్ సోమవారం తన ఇంట్లో దశ మాత అమ్మవారి విగ్రహానికి పూజలు చేపట్టాడు. గ్రామస్తులు హాజరై అమ్మవారికి పూజలు చేశారు. ఆ సమయంలో శంకర్ కుమార్తె అయిన 15 ఏళ్ల బాలిక ఉన్నట్టుండి తాను అమ్మవారినంటూ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అమ్మవారి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కత్తి తీసుకుని వీరంగం సృష్టించింది. ఆ కత్తితో చంపుతానంటూ అందరినీ బెదిరించింది.

ఆమెను పట్టుకునేందుకు ఆమె తండ్రి శంకర్, పెదనాన్న సురేష్ ప్రయత్నించారు. ఈ క్రమంలో శంకర్ కు కత్తి గుచ్చుకోవడం తో గాయాలయ్యాయి. దీంతో ప్రజలంతా భయపడి ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే అదే సమయంలో సురేష్ కుమార్తె పుష్ప (9) ఇంట్లో నిద్రిస్తుండగా ఆమె కత్తితో చిన్నారి తల నరికి చంపింది. తాను అమ్మవారినంటూ బాలిక తన చెల్లినే నరికి చంపడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

First Published:  2 Aug 2022 6:02 AM GMT
Next Story