Telugu Global
National

అశోక్ గెహ్లాట్ సీక్రెట్ నోట్ లీక్.. దుమారం

బీజేపీ తరపున కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనబోయాడు, ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15 కోట్లు ఇచ్చేందుకు ప్రయత్నించారని కూడా అశోక్ ఆరోపించారు.

అశోక్ గెహ్లాట్ సీక్రెట్ నోట్ లీక్.. దుమారం
X

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సీక్రెట్‌ నోట్‌ లీక్ అవ్వ‌డం కాంగ్రెస్‌లో దుమారం రేపింది. సోనియాను కలిసేందుకు వెళ్తున్న సమయంలో తన వెంట పొడిపొడి అక్షరాలతో అశోక్ గెహ్లాట్ ఒక నోట్‌ రాసుకుని తీసుకెళ్లారు. అది మీడియా కెమెరాకు చిక్కింది. అందులోని పదాలు, అంకెలు ఇప్పుడు చర్చకు తెరలేపాయి.

ఈ కుర్రాడు చాలా ప్రమాదకారి, ఎప్పటికైనా పార్టీ వీడి వెళ్తాడు.. మనవాడు కాదు అంటూ సొంత చేతిరాతతో అశోక్ నోట్‌ రాసుకున్నారు. ఎస్పీ అన్న పదం అందులో ఉంది. ఎస్పీ అంటే సచిల్ పైలెట్‌ అన్న చర్చ నడుస్తోంది. సచిల్ పైలట్‌పై సోనియాకు ఫిర్యాదు చేసేందుకు అశోక్‌ నోట్ రాసుకున్నారని విమర్శలు వస్తున్నాయి.

బీజేపీ తరపున కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనబోయాడు, ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15 కోట్లు ఇచ్చేందుకు ప్రయత్నించారని కూడా అశోక్ ఆరోపించారు. తన ఖాతాలో 102 మంది ఎమ్మెల్యేలుండగా.. సచిన్ వెంట కేవలం 18 మంది మాత్రమే ఉన్నారన్న అర్థమొచ్చేలా నోట్ ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ ప్రభుత్వంపై కుట్రకు సచిన్ ప్రయత్నించారని ఆరోపించారు.

సోనియా దగ్గర సచిన్ పైలెట్‌పై ఏ పాయింట్ మరిచిపోకుండా చెప్పడానికి వీలుగా ఇలా అశోక్ గెహ్లాట్ పొడి అక్షరాలతో పాయింట్లు రాసుకుంటున్నట్టు భావిస్తున్నారు. అయితే ఈ నోట్‌ను ఉద్దేశపూర్వకంగా మీడియా కంటపడేలా అశోక్ గెహ్లాట్ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నోట్‌కు సంబంధించిన ఫోటోలను మలయాళ మనోరమ చీఫ్ ఫొటోగ్రాఫర్ సురేష్‌ జయప్రకాశ్‌ షేర్ చేశారు.

First Published:  1 Oct 2022 1:11 PM GMT
Next Story