Telugu Global
National

మోదీపై ప్రియాంక అదిరిపోయే పంచ్..

ప్రజల బాధలు వినేందుకు వచ్చే ప్రధానులను చూశాం కానీ, తనను తిడుతున్నారని ప్రజల ముందు తన బాధలను చెప్పే ప్రధానిని తొలిసారిగా చూస్తున్నామంటూ ఆమె మోదీకి కౌంటర్ ఇచ్చారు.

మోదీపై ప్రియాంక అదిరిపోయే పంచ్..
X

"నన్ను కాంగ్రెస్ నేతలు తిడుతున్నారు, ఇప్పటికే 91 సార్లు తిట్టారు, తిట్టిన ప్రతిసారీ వారు ఓడిపోయారు." అంటూ ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సింపతీ కోసం ప్రధాని ఇలా బేలగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు చెణుకులు విసిరారు. తాజాగా ప్రియాంక గాంధీ కూడా మోదీపై అదిరిపోయే పంచ్ విసిరారు. ప్రజల బాధలు వినేందుకు వచ్చే ప్రధానులను చూశాం కానీ, తనను తిడుతున్నారని ప్రజల ముందు తన బాధలను చెప్పే ప్రధానిని తొలిసారిగా చూస్తున్నామంటూ ఆమె మోదీకి కౌంటర్ ఇచ్చారు.

కర్నాటకలో ని బాగల్ కోట్ జిల్లాలో జరిగి బహిరంగ సభలో ప్రియాంక గాంధీ, మోదీపై మాటల తూటాలు పేల్చారు. మోదీని నిజంగానే ఎవరైనా తిట్టి ఉంటే.. అవి కేవలం ఒక పేజీలో సరిపోతాయని, కానీ ఆయన గాంధీ కుటుంబాన్ని అవమానించిన తీరుని వివరించాలంటే కు ఒక పుస్తకమే కావాలన్నారు. రెండు మూడు రోజుల నుంచి ప్రధాని నరేంద్రమోదీని చూస్తే వింతగా ఉందన్నారు. ఇందిరాగాంధీ దేశం కోసం తూటాలకు బలయ్యారని, రాజీవ్ గాంధీ ప్రాణాలర్పించారని, పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ దేశం కోసం కష్టపడ్డారని.. కానీ మోదీ లాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదని ప్రియాంక గాంధీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.


రాహుల్ ని చూసి నేర్చుకోండి..

రాహుల్ గాంధీని చూసయినా మోదీ దైర్యం తెచ్చుకోవాలన్నారు ప్రియాంక గాంధీ. దేశం కోసం బుల్లెట్ గాయాలకు సైతం రాహుల్ సిద్ధంగా ఉన్నారని, బీజేపీ నేతలు దూషించినా, కాల్చి చంపినా, నిజం కోసం నిలబడతానని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు.

First Published:  30 April 2023 4:47 PM GMT
Next Story