Telugu Global
National

భారత్‌లో అడుగు పెట్టిన నమీబియా చీతాలు..!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో చీతా ప్రాజెక్టును శనివారం ప్ర‌ధాని ప్రారంభించారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను మోదీ ప్రత్యేక క్వారెంటైన్‌ ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు.

భారత్‌లో అడుగు పెట్టిన నమీబియా చీతాలు..!
X

దేశంలో దాదాపు 74 ఏళ్ల తర్వాత మళ్లీ చీతాలు అడుగుపెట్టాయి. నమీబియా దేశం నుంచి 8 చీతాలను దేశానికి విమానంలో తీసుకొచ్చారు. నమీబియాలో చీతాలతో బయల్దేరిన ప్రత్యేక విమానం శనివారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చేరుకుంది. మహారాజ్ పుర ఎయిర్ బేస్‌లో ఈ విమానం ల్యాండ్ కాగా చీతాలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. దేశంలో అంతరించిపోయిన మూడు మగ, ఐదు ఆడ చీతాలను ప్రత్యేక విమానంలో నమీబియా నుంచి తీసుకొచ్చారు. కాగా నమీబియా నుంచి చీతాలతో వచ్చిన ప్రత్యేక విమాన ముందు భాగాన్ని చీతాల ముఖంతో డిజైన్ చేయడం అందరినీ ఆకట్టుకుంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో చీతా ప్రాజెక్టును శనివారం ప్ర‌ధాని ప్రారంభించారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను మోదీ ప్రత్యేక క్వారెంటైన్‌ ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు. అనంతరం మోదీయే స్వయంగా కెమెరా చేతపట్టి వాటి ఫొటోలు తీశారు.

కాగా 1948లో దేశంలో చీతాలు అంతరించి పోయాయి. ఆ ఏడాది ఉమ్మడి మధ్యప్రదేశ్ రాష్ట్రం కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయింది. ఆ తర్వాత వీటి ఆనవాళ్లు ఎక్కడా కూడా కనిపించలేదు. వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 74 ఏళ్ల తర్వాత దేశంలో మళ్లీ చీతాలా గాండ్రింపులు వినిపించనుండటంతో జంతు ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  17 Sep 2022 7:43 AM GMT
Next Story