Telugu Global
National

విద్యార్థితో మసాజ్ చేయించుకున్న మహిళా టీచర్ సస్పెన్షన్..!

టీచర్ సదరు విద్యార్థితో చాలాసేపు మసాజ్ చేయించుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారి చివరకు విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్ళింది.

విద్యార్థితో మసాజ్ చేయించుకున్న మహిళా టీచర్ సస్పెన్షన్..!
X

పాఠశాలలో విద్యార్థులతో నానా చాకిరీ చేయించుకోవడం దేశంలో చాలా చోట్లా సాగుతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఈ సంస్కృతి అంతగా కనపడటం లేదు కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం విపరీతంగా ఉంది. విద్యార్థులతో పాఠశాలకు కావాల్సిన తాగునీటిని తెప్పించుకోవడం, తరగతి గదులను శుభ్రం చేయించడం, టేబుళ్లు, కుర్చీలు మోయించ‌డం అనేక ప్రాంతాల్లో జ‌రుగుతూనే ఉంది. విద్యార్థులతో పనులు చేయించుకోవద్దని విద్యాశాఖ అధికారులు తరచూ హెచ్చరిస్తునప్పటికీ ఈ తంతు మాత్రం కొనసాగుతూనే వస్తోంది.

తాజాగా ఒక మహిళా టీచర్ మరో అడుగు ముందుకేసి తరగతి గ‌దిలోనే విద్యార్థితో మసాజ్ చేయించుకుంది. దీనికి సంబంధించిన వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ కావడంతో ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హార్దోయ్ జిల్లా పోఖారీ ప్రైమరీ స్కూల్లో టీచర్ ఊర్మిలా సింగ్ తరగతి గదిలోని కుర్చీలో కూర్చొని ఒక విద్యార్థి తో కాళ్లు, చేతులు ప‌ట్టించుకుంది. ఇది గమనించిన కొందరు వీడియో తీశారు.

టీచర్ సదరు విద్యార్థితో చాలాసేపు మసాజ్ చేయించుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారి చివరకు విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్ళింది. ఈ సంఘటనపై వారు సీరియస్ అయ్యారు. విద్యార్థితో మసాజ్ చేయించుకున్న ఊర్మిలాసింగ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా జరిగిన ఘటనపై విచారణకు ఆదేశాలు ఇచ్చారు.

First Published:  28 July 2022 4:46 AM GMT
Next Story