Telugu Global
National

క‌రెన్సీ నోట్లపై గణేష్, లక్ష్మిదేవి ఫోటోలు ముద్రించాలి : కేజ్రీవాల్

క‌రెన్సీ నోట్లపై గణేష్, లక్ష్మిదేవి ఫోటోలు ముద్రించాలని, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. త్వ‌రలోనే గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ డిమాండ్ తెరపైకి తెచ్చారు.

క‌రెన్సీ నోట్లపై గణేష్, లక్ష్మిదేవి ఫోటోలు ముద్రించాలి : కేజ్రీవాల్
X

క‌రెన్సీ నోట్ల‌కు రాజ‌కీయాల‌కు విడ‌దీయ‌రాని సంబంధం ఉంద‌నేది నిర్వివాదాంశం. తాజాగా ఆ నోట్లు ఎలా ఉండాల‌నే విష‌యాన్ని కూడా రాజ‌కీయానికి ఉప‌యోగించుకుంటున్నారు. ఇప్ప‌టికే నోట్ల‌పై గాంధీ మ‌హాత్ముడి బొమ్మ‌కు బ‌దులు నేతాజీ సుభాస్ చంద్ర‌బోస్ ఫొటో ముద్రించాలంటూ అఖిల భార‌త హిందూ మ‌హా స‌భ డిమాండ్ చేస్తోంది. విచిత్రంగా ఆమ్ ఆద్మీ పార్టీ ( ఆప్‌) క‌న్వీన‌ర్‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్‌ కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి ఫొటోతో పాటు వినాయకుడి ఫొటోను కూడా ముద్రించాలని ఆయ‌న కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కరెన్సీ నోట్లపై ఒకవైపు మహాత్ముడి ఫొటో, మరోవైపు లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలను ముద్రించాల‌ని అన్నారు. కేవ‌లం రెండు మూడు శాతం హిందువులు ఉన్న ముస్లిం దేశమైన ఇండోనేషియాలో కరెన్సీ నోట్లపై మన గణేషుడి ఫొటో ముద్రించార‌ని, అటువంట‌ప్పుడు మ‌నం మాత్రం మన కరెన్సీపై ఎందుకు ముద్రించకూడదని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

కరెన్సీ నోట్లపై మన దేవతల ఫొటోలు ముద్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని బుధవారం ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం దక్కదని కేజ్రీవాల్ గుర్తుచేశారు. అలాంటి సమయాల్లో మన శక్తియుక్తులకు దైవానుగ్రహం కూడా తోడైతే ఫలితం దక్కుతుందని ఆయన వివరించారు. ఈ విషయంపై త్వరలోనే ప్రధాని మోడీకి లేఖ రాయనున్నట్లు కేజ్రీవాల్ మీడియాకు తెలిపారు.

ఢిల్లీలో త్వరలో జరగబోయే ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమైందని కేజ్రీవాల్ వివరించారు. ఢిల్లీలో సివిక్ పోల్స్ తో పాటు గుజరాత్ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికలలో సమర్థులైన అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకుంటామని పేర్కొన్నారు. కాగా, దీపావళి సందర్భంగా ఢిల్లీని ముంచెత్తే కాలుష్యం ఈఏడాది తగ్గడంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ఇలాగే సహకరించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా గుజ‌రాత్ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని కేజ్రీవాల్ ఈ డిమాండ్ ను తెర‌పైకి తెచ్చార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

First Published:  26 Oct 2022 8:39 AM GMT
Next Story