Telugu Global
National

ఫాస్టాగ్‌ జాబితా నుంచి పేటీఎం తొలగింపు

ఎలాంటి ఇబ్బందీ లేని ప్రయాణం కొనసాగించటం కోసం తాము పేర్కొన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్‌లు కొనుగోలు చేయాలని ఫాస్టాగ్‌ యూజర్లకు ఈ సందర్భంగా సూచించింది.

ఫాస్టాగ్‌ జాబితా నుంచి పేటీఎం తొలగింపు
X

పేటీఎంకు షాకిచ్చే మరో నిర్ణయం వెలువడింది. ఐహెచ్‌ఎంసీఎల్‌ తాజాగా తీసుకున్న నిర్ణయంతో పేటీఎంకు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే.. ఫాస్టాగ్‌ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ను భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ (ఐహెచ్‌ఎంసీఎల్‌) తొలగించింది. ఎలాంటి ఇబ్బందీ లేని ప్రయాణం కొనసాగించటం కోసం తాము పేర్కొన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్‌లు కొనుగోలు చేయాలని ఫాస్టాగ్‌ యూజర్లకు ఈ సందర్భంగా సూచించింది.

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) తరఫున టోల్‌ రుసుము వసూలు చేసే ఈ కంపెనీ తాజా నిర్ణయంతో పేటీఎంకి మరిన్ని కష్టాలు చుట్టుముట్టినట్టయింది.

ఐహెచ్‌ఎంసీఎల్‌ పేర్కొన్న జాబితాలో మొత్తం 32 బ్యాంకులు ఉన్నాయి. వాటిలో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్, అలహాబాద్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, ఎస్‌బీఐ, యెస్‌ బ్యాంక్‌ తదితరాలు ఉన్నాయి. వాటిలో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (పీపీబీఎల్‌) మాత్రం లేదు.

ఫిబ్రవరి 29 తర్వాత వినియోగదారుల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌ లో డిపాజిట్లు, టాప్‌–అప్‌లు స్వీకరించొద్దని పీపీబీఎలు ఆర్బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఆయా ఖాతాల్లో ఇప్పటి వరకు ఉన్న సొమ్మును మాత్రం అది అయిపోయేంత వరకు ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. రిజర్వ్‌బ్యాంక్‌ ఆంక్షల నేపథ్యంలోనే ఐహెచ్‌ఎంసీఎల్‌ తాజా మార్పులు చేసినట్టు సమాచారం. మరోవైపు ఫాస్టాగ్‌ యూజర్లంతా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఐహెచ్‌ఎంసీఎల్‌ సూచించడం గమనార్హం.

First Published:  16 Feb 2024 9:52 AM GMT
Next Story