Telugu Global
National

ఢిల్లీ ప్రమాదంలో కొత్త కోణం.. అంజలి స్నేహితురాలిపై డ్రగ్స్ కేసు

ప్రమాదం జరిగిన రోజు అంజలితోపాటు స్కూటీపై ప్రయాణించిన నిధి గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. ఆ తర్వాత బెయిలుపై బయటకొచ్చింది. పోలీస్ విచారణలో నిధి పాత కేసులు బయటపడ్డాయి.

ఢిల్లీ ప్రమాదంలో కొత్త కోణం.. అంజలి స్నేహితురాలిపై డ్రగ్స్ కేసు
X

దేశ రాజధానిలో నూతన సంవత్సరం రోజున జరిగిన కారు ప్రమాదం సంచలనంగా మారింది. విచిత్రం ఏంటంటే.. ఈ ప్రమాదంపై రోజుకో రకమైన కథనాలు వెలువడుతున్నాయి. అంజలి స్కూటీని ఢీకొనడంతోపాటు, కారుతో సహా ఆమెను ఈడ్చుకెళ్లి, ఆమె మృతి కారణమైనవారు పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే ఆ సమయంలో అంజలితోపాటు స్కూటీలో ఉన్న మరో యువతి నిధి వ్యవహారం ఇప్పుడు అంతు చిక్కకుండా ఉంది. ఎవరీ నిధి, ప్రమాదం తర్వాత ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు, కనీసం స్నేహితురాలిని కాపాడాలని ఎందుకు అనుకోలేదు.. ఇలాంటి ప్రశ్నలన్నీ తలెత్తుతున్నాయి. తాజాగా నిధి పాత నేరస్థురాలని తేలడం ఈ కేసులో మరో సంచలనం.

డ్రగ్స్ కేసులో నిధి నిందితురాలు..

ప్రమాదం జరిగిన రోజు అంజలితోపాటు స్కూటీపై ప్రయాణించిన నిధి గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. ఆ తర్వాత బెయిలుపై బయటకొచ్చింది. పోలీస్ విచారణలో నిధి పాత కేసులు బయటపడ్డాయి. 2020 డిసెంబర్ లో తెలంగాణ నుంచి ఢిల్లీకి 30 కేజీల గంజాయి సరఫరా చేస్తూ ఆగ్రా రైల్వే స్టేషన్లో నిధి పట్టుబడినట్టు పోలీసులు తెలిపారు. పాత కేసుని కూడా ఇప్పుడు తిరగదోడుతున్నారు. అసలు నిధితో అంజలికి స్నేహం ఎలా మొదలైంది, వారిద్దరి మధ్య సంబంధం ఏంటనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

నిధి ఆరోపణలు ఎంతవరకు నిజం..?

ప్రమాదం జరిగిన రోజు.. నిధి, అంజలి గొడవ పడ్డారని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పడం విశేషం. అంజలి ఆ సమయంలో మద్యం సేవించి ఉందని నిధి ఆరోపించిన విషయం కూడా తెలిసిందే. కానీ అంజలి పోస్ట్ మార్టమ్ నివేదికలో మద్యం ఆనవాళ్లు లేవని ఆమె కుటుంబం తరపు న్యాయవాది స్పష్టం చేశారు. అసలు ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందా, లేక నిజంగానే అనుకోని దుర్ఘటనా అనేది కూడా ఇప్పుడు అనుమానంగా మారింది. నిధి నోరు విప్పితే అసలు సంగతి ఏంటో తెలుస్తుంది.

First Published:  8 Jan 2023 2:25 AM GMT
Next Story