Telugu Global
National

బీజేపీ పాలిత రాష్ట్రాల రంగు రంగుల అబద్దాలు బట్టబయలు

బీజేపీ తాను పరిపాలించే రాష్ట్రాల గురించి చెప్పే రంగు రంగుల అబద్దాల పరదా తొలిగిపోతోంది. అక్కడ జరుగుతున్న అక్రమాలు, అవినీతి, నాసిరకం పనుల బండారం బైటపడుతోంది. మధ్యప్రదేశ్ లో ఓ జాతీయ రహదారిపై కట్టిన అతి పెద్ద వంతెన 6 నెలలు కూడా కాకుండానే ఒక్క వర్షానికే కూలిపోయింది.

బీజేపీ పాలిత రాష్ట్రాల రంగు రంగుల అబద్దాలు బట్టబయలు
X

బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా సమర్దవంతంగా పని చేస్తున్నాయి. విపక్ష రాష్ట్రాల ప్రభుత్వాలన్నీ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాయని బీజేపీ ప్రతి క్షణం ప్రచారం చేస్తూ ఉంటుంది. నిజానికి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎలా ఉన్నాయో అక్కడి ప్రజలను ఎవరిని కదిలించినా చెప్తారు. ఆ రాష్ట్రాలను మోడల్ రాష్ట్రాలుగా బీజేపీ చేస్తున్న ప్రచారంలోని డొల్లతనం అక్కడికి పోయి చూసిన ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఆయా ప్రభుత్వాలు చేపడుతున్న పనుల గొప్పతనం ఎంతో కొన్ని మీడియాలైనా అప్పుడప్పుడు బైటపెడుతుంటాయి. ఇప్పుడోసారి మధ్యప్రదేశ్ కథ చూద్దాం. అక్కడ వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం రోడ్లు నిర్మించింది. అయితే ఒక్క వర్షానికే ఆ రోడ్ల పరిస్థితి ఏమైందో కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా బహిర్గతం చేశాయి.

మధ్యప్రదేశ్ రైసెన్ జిల్లాలో భోపాల్, జైపూర్ నేషనల్ హైవే 46పై 529 కోట్లతో కలియాసోట్ వద్ద ఓ వంతెన నిర్మించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో దీన్ని నిర్మించారు. ఇప్పుడు కురిసిన మొదటి వర్షానికే ఆ వంతెన కూలిపోయింది. అదృష్టవశాత్తు అది కూలిన సమయంలో దాని మీద వాహనాలేవీ లేవు. ఆదివారం అర్దరాత్రి ఈ వంతెన‌ కూలిపోవడంతో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు.


దీనిపై అధికారులుమాత్రం తమ తప్పేమీ లేదని కాంట్రాక్టరే బాధ్యత వహించాలని చెప్తున్నారు. ఈ వంతెన గ్యారెంటీ పీరియడ్‌లో ఉందని, కాబట్టి కాంట్రాక్టర్ మరమ్మతు పనులు చేస్తాడని మధ్యప్రదేశ్ రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చీఫ్ ఇంజనీర్ అశుతోష్ మిశ్రా అన్నారు. మరి కాంట్రాక్టర్ ఇంత నాసిరకంగా వంతెన నిర్మిస్తున్నప్పుడు ఈ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏం చేసినట్టు ?

ఇదొక్కటే కాదు నాలుగు రోజుల ముందు ఇదే రాష్ట్రంలో భోపాల్‌-నాగ్‌పూర్ జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన ఓ వంతెన పూర్తిగా కొట్టుకపోయింది. నర్మదాపురం జిల్లా పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సుఖ్తావ గ్రామంలో నర్మదాపురం - బేతుల్ మధ్య నూతనంగా నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది. దీంతో భోపాల్‌-నాగ్‌పూర్‌ రహదారిని మూసివేశారు.

ఈ రహదారిపై పాత వంతెన కూలిపోవడంతో ఈ వంతెన కొత్తగా నిర్మించారు. మొదటి వర్షానికే ఈ వంతెన కొట్టుకపోయింది. ఇంకా ఆశ్చర్యకరంగా ఈ దారికి ప్రత్యామ్నాయ మార్గమైన హర్దా రోడ్‌లోని హతేడ్ మరియు గంజల్ నదిపై నిర్మించిన వంతెన కూడా నీటిలో మునిగిపోయింది. అంటే ప్రస్తుతం భోపాల్ నుంచి నాగ్ పూర్ కు వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయినట్టే.

దేశంలో స్వాతత్య్రం వచ్చిన కొత్తలో నిర్మించిన వంతెనలు కూడా ఇప్పటికీ పటిష్టంగా ఉంటే మొన్న మొన్న నిర్మించిన ఈ వంతెనలు, రోడ్లు ఒక్క వర్షానికే ఎందుకు కొట్టుకపోతున్నట్టు ? తాము నిజాయితీగా పరిపాలన చేస్తామని, తమ పాలనలో అక్రమాలే జరగవని గొప్పలు చెప్పుకునే బీజేపీ నాయకులు ఇంత నాసిరకం పనులు ఎందుకు చేయించినట్టు ? ఏ అక్రమాలు జరగకుండానే ఇంత నాసిరకం పనులు జరిగాయా ? ఒక్క వర్షానికే కొట్టుకపోయే వంతెనలు, రోడ్లు నిర్మించి ప్రజల సొమ్ముతో ఎవరి జేబులు నింపుతున్నట్టు ? ఈ విధంగా ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్న అక్కడి పాలకులు జవాబు చెప్పాల్సిన అవసరం లేదా ?


ఇక బీజేపీ పరిపాలిస్తున్న మరో రాష్ట్రం కర్నాటకలో రోడ్లు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో కింది వీడియో చూడండి


First Published:  25 July 2022 10:03 AM GMT
Next Story