Telugu Global
National

మళ్లీ అంబులెన్స్ కి దారిచ్చిన మోదీ.. మళ్లీ కామెడీ చేసిన బీజేపీ

హిమాచల్ ప్రదేశ్ లో అంబులెన్స్ కి దారిచ్చిన మోదీ అంటూ బీజేపీ ప్రచారం మొదలు పెట్టే సరికి నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. స్టార్ట్, కెమెరా, యాక్షన్ అంటూ కామెంట్లు పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు.

మళ్లీ అంబులెన్స్ కి దారిచ్చిన మోదీ.. మళ్లీ కామెడీ చేసిన బీజేపీ
X

అప్పట్లో మోదీ గురించి ఎలాంటి వార్త సోషల్ మీడియాలో వచ్చినా ఆహా ఓహో అంటూ పొగడ్తలే బాగా కనిపించేవి. కానీ రాను రాను అయ్యగారి విన్యాసాలు జనాలకి బాగా అర్థమవుతున్నాయి. ఒకటా, రెండా ఎనిమిదేళ్లుగా మోదీ మాయ జనాలకు బాగానే ఎక్కేసింది. ఏది ప్రచారమో, ఏది విన్యాసమో ఇట్టే పట్టేస్తున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో అంబులెన్స్ కి దారిచ్చిన మోదీ అంటూ బీజేపీ ప్రచారం మొదలు పెట్టే సరికి నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. స్టార్ట్, కెమెరా, యాక్షన్ అంటూ కామెంట్లు పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు.


ఆమధ్య గుజరాత్ లో కూడా ఇలాంటి సన్నివేశమే జరిగింది. కాన్వాయ్ ఆపి మరీ ప్రధాని మోదీ అంబులెన్స్ కి దారిచ్చారంటూ బీజేపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ప్రచారం చేసుకుంది. అప్పట్లోనే ఆ ట్వీట్ కి భారీగా కౌంటర్లు పడ్డాయి. ఇప్పుడు హిమాచల్ లో అదే సీన్ రిపీటైంది. అంబులెన్స్ అటు వెళ్లిపోగానే, ఇటు మోదీ కాన్వాయ్ కదిలింది. ఈ వీడియోని కూడా బీజేపీ తన ట్విట్టర్ పేజ్ లో పబ్లిష్ చేసింది. అందరూ మోదీని ఆదర్శంగా తీసుకోవాలని, అంబులెన్స్ లకు దారివ్వాలని సందేశం కూడా జతచేశారు. దీంతో ఈసారి ట్రోలింగ్ మరింత పెరిగింది. బీజేపీ పోస్ట్ చేసిన వీడియోలో అన్ని రకాల కెమెరా విజువల్స్ ఎలా కలిశాయో చెప్పాలంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. మోదీ ప్రచారానికి వస్తున్నారంటేనే ఏదో ఒక డ్రామా ఉంటుందని ఊహించామంటూ కామెంట్లు పెడుతున్నారు.

మోదీ సభకు ఆదరణ కరవు..

కాంగ్డా జిల్లాలోని సుజన్‌ పూర్‌ బహిరంగ సభలో పాల్గొన్నారు మోదీ, కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కు పెట్టారు. ఆ పార్టీ వల్లే హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధిలో వెనకపడిందని ఆరోపించారు. ఈ సభకు జన సమీకరణ విషయంలో బీజేపీ విఫలమైంది. జనంలేక సభ వెలవెలబోయిందని, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ పరాజయానికి ఇదే తొలిమెట్టు అని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.

First Published:  9 Nov 2022 3:53 PM GMT
Next Story