Telugu Global
National

భారతీయుల్లో 45 కోట్ల మంది మధ్య తరగతివారే... 18 రెట్లు పెరిగిన సూపర్ రిచ్ కుటుంబాలు

వార్షిక ఆదాయం 5 లక్షల నుంచి 30 లక్షల మధ్యలో ఉన్న కుటుంబాల శాతం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2004-05 లో రెట్టింపు అయింది. రాజకీయ, ఆర్థిక సంస్కరణల ప్రభావంతో 2047 నాటికి మధ్య తరగతి, ఉన్నత వర్గాల మధ్య అంతరం ఇంకా పెరుగుతూ ఉంది.

భారతీయుల్లో 45 కోట్ల మంది మధ్య తరగతివారే... 18 రెట్లు పెరిగిన సూపర్ రిచ్ కుటుంబాలు
X

భారతదేశంలో మధ్యతరగతి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ ఉంది. ప్రస్తుతం ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు మధ్యతరగతికి చెందిన వారేనని ఆర్థిక పరిశోధన సంస్థ పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ ( PRICE) ప్రకటించింది. 2047 కల్లా ఈ సంఖ్య మరింత పెరిగి దేశ జనాభాలో 63% అవుతుందని ప్రైస్ MD, CEO రాజేష్ శుక్లా చెప్పారు.

''వార్షిక ఆదాయం 5 లక్షల నుంచి 30 లక్షల మధ్యలో ఉన్న కుటుంబాల శాతం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2004-05 లో రెట్టింపు అయింది. రాజకీయ, ఆర్థిక సంస్కరణల ప్రభావంతో 2047 నాటికి మధ్య తరగతి, ఉన్నత వర్గాల మధ్య అంతరం ఇంకా పెరుగుతూ ఉంది.'' అని ప్రైస్ ఎండీ, సీఈవో రాజేష్ శుక్లా వ్యాఖ్యానించారు.

ఇక దేశంలో సూపర్ రిచ్ కుటుంబాలు కూడా చాలా పెరిగాయి. 26 ఏళ్లలో అతి సంపన్న కుటుంబాలు 18 రెట్లు పెరిగాయి. సూపర్ రిచ్ కుటుంబాల సంఖ్య 1994-95లో 98,000 ఉంటే 2020-21 నాటికి 18 లక్షల కుటుంబాలకు పెరిగింది.

PRICE (పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ) తాజా సర్వే ఫలితాల ప్రకారం, 2021లో సంవత్సరానికి రూ. 2 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న 6. 4 లక్షల అతి సంపన్న కుటుంబాలతో మహారాష్ట్ర ధనిక రాష్ట్రంగా ఉంది. "ది రైజ్ ఆఫ్ ఇండియాస్ మిడిల్ క్లాస్" నివేదిక ప్రకారం రూ. 1. 81 లక్షల కుటుంబాలతో ఢిల్లీ రెండో స్థానంలో, 1. 41 లక్షల కుటుంబాలతో గుజరాత్ మూడో స్థానంలో, 1. 37లక్షల కుటుంబాలతో తమిళనాడు నాలుగో స్థానంలో, 1. 01 లక్షల కుటుంబాలతో పంజాబ్ ఐదో స్థానంలో ఉన్నాయి.

ఈ నివేదిక ... సంవత్సర ఆదాయం 2020-21లో రూ. 1,25,000 ఉన్న వాళ్ళను పేదలుగా, సంవత్సర ఆదాయం 2 కోట్ల రూపాయలుగా ఉన్న వాళ్ళను సూపర్ రిచ్ గా, రూ. 5 లక్షల నుండి రూ. 30 లక్షల మధ్య ఉన్న వాళ్ళను మధ్యతరగతి వర్గీకరించింది.

ప్రైస్ సంస్థ చేసిన సర్వే ప్రకారం దేశంలో పేదల్లోని ఒక్కరికి కూడా స్వంత కారు గానీ, ఇంట్లో ఏసీ గానీ లేదు. సంవత్సరానికి రూ. 5 లక్షల నుండి రూ. 15 లక్షల మధ్య ఆదాయం ఉన్న మధ్యతరగతి కేటగిరీలో, ప్రతి 10 కుటుంబాలలో దాదాపు ముగ్గురికి కారు ఉంది.ప్రతి 100 మందిలో ఇద్దరికి ఏసీ ఉంది. ఇక ధనిక కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి ఒక కారు ఉండగా , అదే సూపర్ రిచ్ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి మూడు కార్లున్నాయి. ధనికుల్లో దాదాపు సగం మందికి ఏసీలున్నాయి.

భారత దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వారీగా, ఎనిమిది ఆదాయ వర్గాల్లోని ప్రజలను సర్వే చేసి ఈ నివేదిక రూపొందించారు.

First Published:  2 Nov 2022 6:10 AM GMT
Next Story