Telugu Global
National

విప‌క్షాల వెంటే శ‌ర‌ద్ ప‌వార్‌.. - రెండోరోజు భేటీకి హాజ‌రు

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించటమే ఏకైక లక్ష్యంగా విప‌క్షాలు బెంగ‌ళూరులో ఈ భేటీ ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.

విప‌క్షాల వెంటే శ‌ర‌ద్ ప‌వార్‌.. - రెండోరోజు భేటీకి హాజ‌రు
X

బెంగ‌ళూరులో సోమ‌వారం జ‌రిగిన విప‌క్షాల భేటీకి దూర‌మైన ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ స‌మావేశాల రెండోరోజైన మంగ‌ళ‌వారం నాడు హాజ‌ర‌య్యారు. ఎన్సీపీని చీల్చి మహారాష్ట్ర బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా చేరిన అజిత్ పవార్ సోమ‌వారం శరద్ పవార్‌ను క‌లిసిన విష‌యం తెలిసిందే. దీంతో పాటు తొలిరోజు శ‌ర‌ద్ ప‌వార్ విప‌క్షాల భేటీకి హాజ‌రుకాక‌పోవ‌డంతో ఆయ‌న రాక‌పై అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే వాటికి చెక్ పెడుతూ శరద్ పవార్ ప్రతిపక్షాల సమావేశానికి హాజరవుతారని ఎన్సీపీ అధికారికంగా ప్రకటించింది. మంగ‌ళ‌వారం నాడు భేటీకి హాజ‌రైన శ‌ర‌ద్ ప‌వార్‌కు కాంగ్రెస్, ఇతర విపక్ష నేతలు ఆయనను సాదరంగా ఆహ్వానించారు.

కామ‌న్ మినిమం ప్రోగ్రాం..

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించటమే ఏకైక లక్ష్యంగా విప‌క్షాలు బెంగ‌ళూరులో ఈ భేటీ ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. రెండు రోజుల‌పాటు నిర్వ‌హించ త‌ల‌పెట్టిన ఈ భేటీలో రెండోరోజైన మంగ‌ళ‌వారం ఉద‌యం ఆయా పార్టీల నేత‌లు పాల్గొని చ‌ర్చ‌లు ప్రారంభించారు. కనీస ఉమ్మడి కార్యక్రమ (కామ‌న్ మినిమం ప్రోగ్రాం) రూపకల్పనకు ఒక ఉప సంఘాన్ని నియమించడం, కూటమికి సంబంధించిన అంశాలపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థను రూపొందించడం వంటివాటిపై రెండో రోజు భేటీలో చర్చించనున్న‌ట్టు స‌మాచారం. రాష్ట్రాలవారీగా సీట్ల సర్దుబాటు ఎలా జరగాలి.. ఎన్నికల వ్యవస్థలో ఎలాంటి సంస్కరణలు ప్రతిపాదించాలి వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఈ భేటీలోనే కూట‌మికి పేరు..!

ఈ భేటీలోనే విప‌క్షాల కూట‌మికి ఒక పేరును కూడా నిర్ణ‌యించాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. విపక్షాల ఫ్రంట్ అధ్యక్ష బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అప్పగించే అవకాశాలున్న‌ట్టు చ‌ర్చ జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. దీనికి ఆయా పార్టీలు ఎలాంటి వైఖ‌రిని వ్య‌క్తం చేస్తాయ‌నేది చూడాల్సి ఉంది.

రెండో రోజు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మమతాబెనర్జీ (పశ్చిమ బెంగాల్-టీఎంసీ), నితీశ్ కుమార్ (బిహార్-జేడీయూ), ఎం.కె.స్టాలిన్ (తమిళనాడు-డీఎంకే), అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ-ఆప్), భగవంత్ మాన్ (పంజాబ్-ఆప్), హేమంత్ సోరెన్ (జార్ఖండ్-జార్ఖండ్ ముక్తి మోర్చా), మాజీ ముఖ్యమంత్రులు- ఉద్ధవ్ ఠాక్రే (మహారాష్ట్ర), అఖిలేశ్ యాదవ్ (ఉత్తరప్రదేశ్), లాలూ ప్రసాద్ యాదవ్ (బిహార్), మెహబూబా ముఫ్తీ (జమ్మూ-కశ్మీర్), సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఎండీఎంకే నేత వైగో, జయంత్ చౌదరి (ఆర్ఎల్డీ) తదితరులు పాల్గొన్నారు.

First Published:  18 July 2023 9:00 AM GMT
Next Story