Telugu Global
National

భర్త ఆత్మహత్యపై అనుమానం ఉందన్న భార్య.. చెప్పుల దండేసి ఊరేగించిన అత్తింటి వారు

ఒకరోజు తన భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు అత్తమామలు ఆమెతో చెప్పారు. దీంతో ఆమె అత్తవారింటికి తిరిగి వచ్చేసింది. కాగా ఈనెల 30వ తేదీన ఆమె భర్త దశదిన కర్మ జరిపారు.

భర్త ఆత్మహత్యపై అనుమానం ఉందన్న భార్య.. చెప్పుల దండేసి ఊరేగించిన అత్తింటి వారు
X

భార్య‌ పుట్టింటికి వెళ్లిన‌ప్పుడు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేయడమే భార్య చేసిన నేరం. రెచ్చిపోయిన అత్తింటివారు ఆమె ముఖానికి మసి పూసి, మెడలో చెప్పుల దండ వేసి ఊరంతా ఊరేగించారు. ఈ అమానవీయ సంఘటన మహారాష్ట్రలో జరిగింది.

నాసిక్ సమీపంలోని శివ్రే గ్రామంలో దంపతులు నివసిస్తున్నారు. కొద్దిరోజుల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లి అక్కడ చికిత్స చేయించుకుంటూ కోలుకుంటోంది. భర్త శివ్రే గ్రామంలోనే ఉంటూ అప్పుడప్పుడు పిల్లలతో కలిసి వెళ్లి భార్యను చూసి వస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఒకరోజు తన భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు అత్తమామలు ఆమెతో చెప్పారు. దీంతో ఆమె అత్తవారింటికి తిరిగి వచ్చేసింది. కాగా ఈనెల 30వ తేదీన ఆమె భర్త దశదిన కర్మ జరిపారు. ఆ సమయంలో తన భర్త మరణంపై అతడి సోదరిని ప్రశ్నించింది. ఆయన మరణంపై తనకు సందేహాలు ఉన్నట్లు తెలిపింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మరదలు వదినపై దాడి చేసింది.

అత్తింటివారు, గ్రామస్తులు ఆమె ముఖానికి మసిపూసి మెడలో చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారు. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకొని బాధితురాలిని రక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేసిన ఒకే ఒక్క కారణంతో ఆమె పట్ల అత్తింటి వారు, గ్రామస్తులు కర్కశంగా ప్రవర్తించడం సంచలనం సృష్టిస్తోంది.

First Published:  1 Feb 2023 9:05 AM GMT
Next Story