Telugu Global
National

ఫేక్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించిన మోడీ... ఫేకూ ప్రభుత్వమంటూ సోషల్ మీడియాలో దాడి

ప్రధాని నరేంద్ర మోదీ నిన్న గుజరాత్ లో మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించారు. అయితే చుట్టూ ఫ్లెక్సీలు పెట్టి ఆ ఫ్లెక్సీల మీద కిటికీని, ఇతర బొమ్మలను చిత్రీకరించి, ఐదుగురు విద్యార్థులను కూర్చో బెట్టి వారి మధ్యలో మోడీ కూర్చొని కొన్ని ఫోటోలకు ఫోజులిచ్చి ఆ తర్వాత ఆ సెట్టింగునంతా తీసేశారని ఆరోపణలు గుప్పుమన్నాయి.

ఫేక్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించిన మోడీ... ఫేకూ ప్రభుత్వమంటూ సోషల్ మీడియాలో దాడి
X

ప్రధాని మోడికి, బీజేపీకి సోషల్ మీడియా లో నెటిజనులు 'ఫేకూ' అనే పేరును ఖాయం చేశారు. చిన్నప్పుడే చెరువు నుంచి ఇంటికి మొసలి తెచ్చానని, రైల్వే స్టేషన్ లో టీ అమ్మానని...ఇలాంటి కథలే కాక పుట్టినరోజు విషయంలో కూడా ఎన్నో డేట్లు ప్రచారంలో ఉన్న కథలు... 2ab స్క్వేర్ లాంటి కొత్త లెక్కలు...ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అందుకే నెటిజనులు ఫేకూ అని ముద్దుగా పిల్చుకుంటారు. అలాంటి మోడీ నిన్న గుజరాత్ లో ఓ ఫేక్ స్కూల్ ప్రారంభించి ఫేక్ అనే పదాన్ని పరాకాష్టకు చేర్చారు.

గుజరాత్ లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ పడరాని పాట్లు పడుతోంది. ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగి ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఒక్క గుజరాత్ కే కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల్లో 80వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారంటే ఆ రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకోవడం కోసం ఎంతకు తెగిస్తున్నారో అర్దమవుతోంది. ఒక వైపు ఆమ్ ఆద్మీ పార్టీ, మరో వైపు కాంగ్రెస్ లు బీజేపీని ధీటుగా ఎదుర్కొంటున్న పరిస్థితులు, ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత... దాంతో బీజేపీ ఏ పనిచేయడానికైనా రెడీ అవుతున్నది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దిందని పేరు గడించింది. అదే విధంగా గుజరాత్ లో కూడా చేస్తామని చెబుతోంది. దాంతో తామేమీ తక్కువ తినలేదని నిరూపించుకోవడానికి బీజేపీ కొత్త ఎత్తుగడలకు తెరతీసింది.

గుజరాత్ విద్యావ్యవస్థలో గొప్ప మార్పు తీసుకరావడం కోసం, విద్యావ్యవస్థ చాలా స్మార్ట్‌గా తీర్చిదిద్దడం కోసం మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నిన్న‌ గాంధీనగర్ జిల్లా అదాలాజ్ పట్టణంలో మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించారు.

నిజంగా...నిజమైన‌ స్కూల్ ను ప్రారంభిస్తే బాగానే ఉండేది. త్వ‌రగా ప్రారంభోత్సవం చేసి ప్రచారం చేసుకోవాలనే ఆశతో స్కూల్ లేకుండానే స్కూలు ప్రారంభం జరగడంతోనే అసలు సమస్య మొదలైంది. చుట్టూ ఫ్లెక్సీలు పెట్టి ఆ ఫ్లెక్సీల మీద కిటికీని, ఇతర బొమ్మలను చిత్రీకరించి, ఐదుగురు విద్యార్థులను కూర్చో బెట్టి వారి మధ్యలో మోడీ కూర్చొని కొన్ని ఫోటోలకు ఫోజులిచ్చి ఆ తర్వాత ఆ సెట్టింగునంతా తీసేశారని ఆరోపణలు గుప్పుమన్నాయి. ప్రతిపక్షాలే కాదు సోషల్ మీడియాలో నెటిజనులు కూడా ఆ ఫోటోలను షేర్ చేస్తూ మోడీపై, బీజెపిపై విరుచుకపడ్డారు.

తరగతి గదులకు సంబంధించిన కొన్ని చిత్రాలను షేర్ చేసిన‌ ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్, "ఇది క్లాస్ రూం లా కనిపించడం లేదు, ఇది షూటింగ్ కోసం తయారు చేసిన నకిలీ తరగతి గది. పెయింటింగ్ తప్ప కిటికీ లేదు. క్లాసులో ఒక వరుస డెస్క్‌లు మాత్రమే ఉన్నాయి. గోడలు నకిలీవి. పిల్లల డ్రెస్సులు మరియు బూట్లు కొత్తగా కనిపిస్తున్నాయి." అని ట్వీట్ చేశారు.

కొందరు నెటిజనులు మున్నా భాయ్ ఎంబీబీఎస్ మూవీలోని ఆస్పత్రి సెట్ తో పోలుస్తూ సెటైర్లు వేస్తుండగా సీనియర్ జర్నలిస్ట్ గిరీష్ మాల్వియా ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టి ప్రధాని మోడీ ఈ ప్రారంభోత్సవంపై విరుచుకుపడ్డారు.

''మొదట ఫేస్ బుక్ లో స్నేహితుల ఫోటోలు , కామెంట్లు చూసి ప్రధాని అంతటి వాడికి ఫేక్ క్లాస్ రూం అవసరమా అని అనుకున్నాను. నా స్నేహితులు పొరబడ్డారేమో అని భావించాను. దాంతో నేను ANI

ట్విట్టర్ హ్యాండిల్‌లో ఫోటోను పరిశీలించాను. అప్పుడు ఆశ్చర్యపోవడం నావంతయ్యింది. నకిలీ తరగతి గదిని తయారు చేశారు. వీడియోలోని విండో భిన్నంగా కనిపిస్తుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే గోడలపై ఫ్లెక్సీ కనపడుతుంది. ..... విశేషమేమిటంటే.. విండో డిజైన్ చేసిన కోణంలోనే ఫొటోలు, వీడియోలు కూడా చిత్రీకరించడం విశేషం.

దేశ ప్రధాని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలను ప్రకటిస్తుంటే.. ఒక నిజమైన తరగతి గదిని తయారు చేయలేకపోయారా?'' అని ఆయన పోస్ట్ చేశారు.

ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఈ నకిలీ క్లాస్ రూం ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ గుజరాత్ అభివృద్దిని పొగుడుతూ ప్రసంగించారు. నేడు విద్యావ్యవస్థ చాలా స్మార్ట్‌గా మారిందని, గుజరాత్ విద్యావ్యవస్థలో గొప్ప మార్పు కనిపించిందని అన్నారు. ఈ రోజు గుజరాత్ అమృత కాలంలో ఉంది. అమృతాన్ని ఉత్పత్తి చేసే దిశగా పెద్ద అడుగు వేస్తోందని మోడీ గొప్పగా చెప్పారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి, అభివృద్ధి చెందిన గుజరాత్ ఆవిర్భావానికి ఇది ఒక మైలురాయిగా నిరూపించబడబోతోందన్నారు మోడీ.

ఈ ఫేక్ క్లాస్ రూం ప్రారంభోత్సవానికే ఇంతగా గొప్పలు చెప్పుకుంటే నిజంగానే బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు ఏమైనా మంచిగనక చేస్తూ ఇక కిందా మీదా ఉండరేమో మోడీ.



First Published:  20 Oct 2022 4:15 PM GMT
Next Story