Telugu Global
National

మోదీ కీలక ప్రకటన.. పీఎం కిసాన్ ఇక రూ.12వేలు

రాజస్థాన్‌ లోని హనుమాన్‌ గఢ్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. పీఎం కిసాన్ కార్యక్రమం ద్వారా అందించే ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేస్తున్నామన్నారు.

మోదీ కీలక ప్రకటన.. పీఎం కిసాన్ ఇక రూ.12వేలు
X

ఎన్నికల వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. పీఎం కిసాన్ కార్యక్రమం ద్వారా అందించే ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేస్తున్నామన్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మోదీ ఈ కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకూ ఏడాదికి మూడు విడతల్లో మొత్తం రూ.6వేలు రైతుల అకౌంట్లలో జమ చేసేది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆ సాయాన్ని రూ.12వేలకు పెంచింది. అయితే ఎప్పటి నుంచి ఇది అమలులోకి వస్తుందనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రధాని మోదీ పీఎం కిసాన్ కార్యక్రమం ఆర్థిక సాయం పెంపుపై చేసిన ప్రకటన ఆసక్తిగా మారింది. అయితే ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మిగతా మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికలు జరగాల్సి ఉంది. అందులోనూ ఆయా రాష్ట్రాల్లో మేనిఫెస్టోలు కూడా విడుదలయ్యాయి. ఆ మేనిఫెస్టోల్లో కూడా కనీసం పీఎం కిసాన్ గురించి చర్చ లేదు. ఈ దశలో రాజస్థాన్ పర్యటనలో ఉన్న మోదీ పీఎం కిసాన్ సాయం పెంచుతున్నామని ప్రకటించడం విశేషం.

రాజస్థాన్‌ లోని హనుమాన్‌ గఢ్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. రైతులను మోసం చేసిన వారిని విడిచిపెట్టబోమని, రైతుల నుండి మద్దతు ధర ప్రకారం పంటలను కొనుగోలు చేయాలని రాజస్థాన్ బీజేపీ నిర్ణయించిందన్నారు. రాజస్థాన్ లో తాము అధికారంలోకి వస్తే రైతులకు బోనస్ కూడా ఇస్తామని మోదీ తెలిపారు. ఇంధన ధరలు సమీక్షిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. అయితే కేవలం రాజస్థాన్ ని దృష్టిలో ఉంచుకుని పీఎం కిసాన్ సాయం రెట్టింపు హామీ ఇచ్చారా అనేది తేలాల్సి ఉంది. రాజస్థాన్ లో బీజేపీ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపున మిగతా సాయం అందిస్తారేమోననే అనుమానాలు కూడా ఉన్నాయి. దీనిపై బీజేపీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.


First Published:  21 Nov 2023 8:13 AM GMT
Next Story