Telugu Global
National

దేన్నీ వదిలిపెట్టం.. ఆన్ లైన్ గేమ్స్ పై 28శాతం జీఎస్టీ

యువతకున్న ఈ వ్యసనాన్ని కేంద్రం ఆదాయవనరుగా చూడటం ఇక్కడ విశేషం. ఆన్ లైన్‌ గేమింగ్ పై ఆంక్షలు విధించకపోగా, దానిపై జీఎస్టీని పెంచుతూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకోబోతోంది.

దేన్నీ వదిలిపెట్టం.. ఆన్ లైన్ గేమ్స్ పై 28శాతం జీఎస్టీ
X

ఆన్ లైన్ గేమ్స్ ని రద్దు చేయాలని, ఆ వ్యసనంతో చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారని రాష్ట్రాలు ఎప్పటినుంచో ఆందోళన చేస్తున్నాయి. తమిళనాడులో ఆన్ లైన్ గేమింగ్ పై ఆంక్షలున్నాయి. అయితే యువతకున్న ఈ వ్యసనాన్ని కేంద్రం ఆదాయ వనరుగా చూడటం ఇక్కడ విశేషం. ఆన్ లైన్‌ గేమింగ్ పై ఆంక్షలు విధించకపోగా, దానిపై జీఎస్టీని పెంచుతూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకోబోతోంది.

ఇప్పటి వరకూ ఆన్ లైన్ గేమింగ్ పై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. దాన్ని 28 శాతానికి పెంచాలంటూ ఇటీవల జీఎస్టీ పెంపు కోసం ఏర్పాటు చేసిన రాష్ట్రాల మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో బీజేపీకే ఎక్కువ భాగస్వామ్యం ఉంది. కేంద్రం సూచన మేరకే ఈ కమిటీ జీఎస్టీ పెంపుపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై జీఎస్టీ మండలి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆన్ లైన్ గేమింగ్ పోర్టల్స్‌ తమ సభ్యులుకు విధించే రుసుముపై జీఎస్టీ విధించాలా, లేక పందెం మొత్తంపై జీఎస్టీ వేయాలా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.

ఆన్ లైన్ గేమ్స్ లో చాలా వరకు ఉచిత గేమ్స్ ఉన్నా.. ఇటీవల యాప్ లు రుసుములు వసూలు చేస్తున్నాయి. బెట్టింగ్ గేమ్స్ కూడా ఆన్ లైన్‌ గేమ్స్ తరహాలోనే కొద్దిమొత్తంలో రుసుములు వసూలు చేస్తూ మెల్లగా మాయలోకి దించుతున్నాయి. బెట్టింగ్ సరదాగా మొదలైనా ఆ తర్వాత జీవితాలే ఖర్చయిపోయిన ఉదాహరణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ పై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం జీఎస్టీ పేరుతో దీన్ని ఓ ఆదాయ వనరుగా చూడటం దారుణం.

First Published:  23 Nov 2022 9:25 AM GMT
Next Story