Telugu Global
National

మహిళా లెక్చరర్‌గా గొంతు మార్చి.. ఏడుగురిపై అత్యాచారం

సీధీ జిల్లాకు చెందిన బ్రజేశ్‌ ప్రజాపతి (30) యాప్‌ సాయంతో మహిళా లెక్చరర్‌గా గొంతు మార్చి, స్కాలర్‌షిప్‌ పని ఉందంటూ విద్యార్థినులకు ఫోన్‌ చేసేవాడు.

మహిళా లెక్చరర్‌గా గొంతు మార్చి.. ఏడుగురిపై అత్యాచారం
X

మధ్యప్రదేశ్‌లో ఓ దిగ్భ్రాంతికర ఘటన ఆలస్యంగా బయటికొచ్చింది. ఓవ్యక్తి ఫోన్‌లో మహిళా లెక్చరర్‌గా నమ్మించి.. ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్కాలర్‌షిప్‌ కోసమని విద్యార్థినులను పిలిపించి, వారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితుల సంఖ్య ఎక్కువే ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసులో ప్రధాన నిందితుడితోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 16 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

యాప్‌ ద్వారా గొంతు మార్చి..

సీధీ జిల్లాకు చెందిన బ్రజేశ్‌ ప్రజాపతి (30) యాప్‌ సాయంతో మహిళా లెక్చరర్‌గా గొంతు మార్చి, స్కాలర్‌షిప్‌ పని ఉందంటూ విద్యార్థినులకు ఫోన్‌ చేసేవాడు. తన కొడుకు మిమ్మల్ని మా ఇంటికి తీసుకువస్తాడు అని ఆ లెక్చరర్‌ చెప్పినట్లు మాట్లాడేవాడు. నిజమని నమ్మి వచ్చిన యువతులను బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడేవాడు. వారి వద్ద నుంచి ఫోన్‌ లాక్కొని పరారయ్యేవాడు.

కాలేజీ వాట్సప్‌ గ్రూపులో నంబర్స్..

ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు మే 16న తొలి కేసు, అనంతరం మరో మూడు కేసులు నమోదయ్యాయి. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. కాలేజీ వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి విద్యార్థినుల ఫోన్‌ నంబర్లు సేకరించినట్లు నిందితుడు తెలిపాడు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ వ్యాప్తంగా ఈ ఘటన ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది. వారం రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

First Published:  26 May 2024 10:27 AM GMT
Next Story