హత్యకేసులో నిందితులను పట్టించిన చిలుక
అషు ఇంటికి వచ్చిన ప్రతిసారీ ఆమెను చూసి అరుస్తూ ఉండేది. దీంతో హత్య చేసిన వారిని చిలుక చూసి ఉంటుందనే అనుమానంతో విజయ్శర్మ పోలీసులకు సమాచారం అందించాడు.
తన కళ్లముందే జరిగిన దారుణ హత్య కేసులో ఓ చిలుక నిందితులను పట్టించి పోలీసులకు సహాయపడింది. ఆశ్చర్యం కలిగించే ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆగ్రాకు చెందిన విజయ్శర్మ, నీలమ్ శర్మ దంపతులు. నీలమ్శర్మ 2014 ఫిబ్రవరి 20న తమ ఇంట్లోనే హత్యకు గురైంది. ఆమెతో పాటు వారి పెంపుడు కుక్కను కూడా నిందితులు దారుణంగా పొడిచి హతమార్చినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.
ఈ కేసులో పోలీసులు విచారణ చేపట్టినప్పటికీ సరైన సాక్ష్యాధారాలు లభించలేదు. మరోపక్క ఈ హత్య జరిగిన తర్వాతి రోజు నుంచి వారి పెంపుడు చిలుక సరిగా తినేది కాదు. అంతేకాదు.. విజయ్ శర్మ మేనకోడలు అషు ఇంటికి వచ్చిన ప్రతిసారీ ఆమెను చూసి అరుస్తూ ఉండేది. దీంతో హత్య చేసిన వారిని చిలుక చూసి ఉంటుందనే అనుమానంతో విజయ్శర్మ పోలీసులకు సమాచారం అందించాడు.
ఈ క్రమంలో ఈ కేసులో ఇంతకుముందు విచారించిన వ్యక్తులతో పాటు అషును కూడా పోలీసులు చిలుక ముందు నిలబెట్టారు. అషును చూసిన వెంటనే చిలుక అరుస్తూ ఉండేది. దీంతో పోలీసులు అషుని తమదైన పద్ధతిలో విచారించగా, ఆమె హత్య చేసిన విషయాన్ని అంగీకరించింది. రోన్నీ అనే వ్యక్తితో కలిసి నగలు, డబ్బు కోసం నీలమ్ శర్మను హత్యచేసినట్టు వెల్లడించింది. పోలీసులు తమ చార్జిషీట్లో చిలుక వాంగ్మూలం గురించి ప్రస్తావించినప్పటికీ.. దానిని సాక్షిగా న్యాయస్థానంలో ప్రవేశపెట్టలేదు. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత చిలుక చనిపోయింది. ఈ కేసులో న్యాయస్థానం నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తాజాగా తీర్పు వెలువరించింది.